● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించగా ఆయన విగ్రహానికి నివాళులర్పించాక శ్రీజ మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. బీసీ సంక్షేమాధికారి జి.జ్యోతి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తి నెహ్రూ గౌడ్, బీసీ సంఘాల నాయకులు కూరాకుల నాగభూషణం, మాయర గంగయ్య, చావళ్ల నాగేశ్వరరావు, కోడి లింగయ్య, చిత్తారు ఇందుమతి, గూడె మల్లయ్య, భూక్యా శోభానాయక్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీలకు వృత్తి శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన మైనారిటీల(ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు)కు వివిధ రంగాలలో వృత్తి శిక్షణ ఇవ్వనునున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. 18 – 35 ఏళ్ల వారిని అర్హులుగా నిర్ధారించగా మూడు నెలల కాలపరిమితితో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా శిక్షణ కోసం ఇంటర్, డిగ్రీ, బీటెక్, టైలరింగ్లో శిక్షణ కోసం పదో తరగతిలోపు అర్హత ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఎన్ఐఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 97040 03002, 96525 71759 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
పరీక్షలకు సిద్ధమయ్యేలా అవకాశం
తిరుమలాయపాలెం: పదో తరగతి వార్షిక పరీక్షలు వరుసగా కాకుండా, మధ్యలో విరామం ఇస్తుండగా విద్యార్థులకు మేలు జరుగుతోందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ విరామంలో మరుసటి పరీక్షకు విద్యార్థులు సన్నద్ధం కావడం సులువవుతోందని చెప్పారు. మండలంలోని తిరుమలాయపాలెం, పిండిప్రోలు, జల్లెపల్లి పాఠశాలల్లో శుక్రవారం ఆయన ప్రత్యేక తరగతులను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాసేలా విరామంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం డిజిటల్ విధానంలో బయాలజీ పాఠం బోధించారు.
‘మీ సేవ’లకు అంతరాయం
ఖమ్మం సహకారనగర్: మీ సేవ సర్వీసుల నిర్వహణలో భాగంగా అంతరాయం ఏర్పడింది. ఈమేరకు శుక్రవారం రాత్రి 8నుంచి ఆదివారం ఉదయం 8గంటల వరకు సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ విషయాన్ని ముందుగానే కేంద్రాల నిర్వాహకులకు సైతం సమాచారం ఇచ్చారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
రవాణా శాఖ సేవలకు..
ఖమ్మంక్రైం: మీ సేవ సర్వర్లో అంతరాయం కారణంగా ఈనెల 5వ తేదీ వరకు రవాణా శాఖ సేవలకు సైతం అంతరాయం ఏర్పడనుందని రవాణా శాఖ కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని ఓ ప్రకటనలో కోరారు.


