‘ఆసరా’ అందించాలని అధికారులకు ఆదేశం
ఖమ్మంఅర్బన్: అనాథలు, దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడైన అన్నం శ్రీనివాసరావు కలెక్టరేట్లో ఇటీవల జరిగిన సమావేశంలో తమ ఫౌండేషన్లో ఆశ్రయం పొందుతున్న అనాథలు, వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన అనాథ శరణాలయంలోని అర్హులకు అవసరమైన ఆధార్, రేషన్కార్డులు, సదరం సర్టిఫికెట్లు ఇప్పించడమే కాక ఆసరా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈమేరకు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ, బీసీ సంక్షేమ శాఖాధికారి జ్యోతి, ఐటీ, ఆధార్ ఇన్చార్జ్ దుర్గాప్రసాద్ శరణాలయాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మానసిక సమస్యలు ఉన్నవారిని హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించేలా పోలీస్, న్యాయస్థానం సహకారంతో చర్యలు చేపడుతామని తెలిపారు. కాగా, అనాథ శరణాలయంలో ఉంటున్న వారికి పదేళ్ల తర్వాత ప్రభుత్వ సాయం అందేలా చొరవ చూపిన కలెక్టర్ అనుదీప్కు అన్నం శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్చార్జ్ ఎంవీఐగా స్వర్ణలత
వైరా: వైరా ఇన్చార్జ్ ఎంవీఐగా ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న స్వర్ణలతను నియమించారు. ఇక్కడ ఎంవీఐగా ఉన్న ఏ.వరప్రసాద్ మంగళవారం ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. ఈ మేరకు స్వర్ణలతకు బాధ్యతలు అప్పగించగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు.


