ఖమ్మం సహకారనగర్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు తదితర ప్రజాప్రతినిధులకు ఈనెల 12వ తేదీ గురువారం శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు, ఫైళ్ల పరిష్కారం, ప్రజాప్రతినిధులకు శిక్షణపై సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ప్రజాప్రతినిధులకు ఇచ్చే శిక్షణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతీ ప్రజాప్రతినిధికి ఆహ్వానం అందించడంతో పాటు భోజన, ఇతర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శిక్షణలో భాగంగా ఉదయం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై అవగాహన కల్పించడంతో పాటు మధ్యాహ్నం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్య శాఖలో కార్యక్రమాలు, అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరించాలని సూచించారు. ఈసమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, సీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ శ్రీరామ్, డీపీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు ఎం.ఏ.రాజు, లఖన్నాయక్, లలిత, అన్సారీతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


