● అప్పుల పాలవుతున్న ఈజీఎస్ సిబ్బంది ● మరోపక్క పని మానేస్తున్న అటెండర్లు
ఎర్రుపాలెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(వీబీజీ రామ్జీ)లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో పాటు ఫీల్డు అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరికి గత రెండు నెలల వేతనం అందలేదు. ఈనెల 10వ తేదీ వరకూ జీతం రాకపోవడంతో కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ 20మందికి కూడా...
ప్రతీ మండల కేంద్రంలోని ఈజీఎస్ కార్యాలయాల నిర్వహణ కోసం ఔట్ సోర్సింగ్ విధానంలో 20 మంది అటెండర్లను రూ.5,200 వేతనంతో నియమించారు. అయితే, వీరికి గత తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. దీంతో వారు విధులు నిర్వర్తించలేక వేరే పనులు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కార్యాలయ నిర్వహణ, స్టేషనరీ ఖర్చులన్నీ కలిపి విద్యుత్ బిల్లు కాకుండా ఏటా రూ.70వేల నిధులు రావాల్సి ఉన్నా రెండేళ్లుగా విడుదల కాలేదు. దీంతో ఏపీఓలు సొంతంగా నగదు వెచ్చించాల్సి వస్తోంది. ఓ పక్క వేతనాలు రాక, మరోపక్క కార్యాలయ నిర్వహణ భారం కావడంతో అవస్థ పడుతున్నారు.


