పెనుబల్లి: మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం పేరిట పంట పొలాలకు నీటి విడుదల నిలిపివేయడం సరికాదని రైతులు పేర్కొన్నారు. ఇకనైనా నీరు విడుదల చేసి ఎండుతున్న వరి పంటను కాపాడాలని బ్రహ్మాళకుంట గిరిజన మహిళా రైతులు కోరారు. ఈమేరకు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పంటకు నీరు ఇవ్వబోమని అటవీశాఖ అధికారులు ముందు సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు పంట చేతికొచ్చే సమయాన ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అధికారుల తీరుతో 600 ఎకరాల్లో వరి ఎండిపోతుండగా ఎకరాకు రూ.15వేలు నష్టం వాటల్లిందని వాపోయారు. ఇకనైనా నీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో నష్టపరిహారమైనా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు చిట్టిమోదుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


