ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
● జిల్లాలోని 17 సెంటర్లలో 5,997 మంది విద్యార్థులు హాజరు ● భద్రాద్రి జిల్లాలో 18 సెంటర్లకు 5,380 మంది..
ఖమ్మంమయూరిసెంటర్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మల్టీజోనల్ అధికారి హెచ్.అరుణకుమారి తెలిపారు. జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,346 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 5,997 మంది పరీక్ష రాశారని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 18 కేంద్రాలకు గాను 5,688 మంది దరఖాస్తు చేసుకోగా 5,380 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ప్రవేశ పరీక్షను అరుణకుమారితో పాటు ఇన్చార్జి జోనల్ అధికారి పి.అపర్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ బి.రుతుమణి పర్యవేక్షించారు.
రెండు గంటలు ఆలస్యం..
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి వద్ద గల గురుకుల విద్యాలయంలో నిర్వహించిన ఏడో తరగతి ప్రవేశ పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రశ్నపత్రం సమయానికి రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ప్రశ్నపత్రాలను తెప్పించారు. దీంతో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటలకు కేంద్రానికి వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం 3 వరకు అక్కడే ఉండాల్సి రావడంతో తల్లిదండ్రులు కొంత అసహనానికి గురయ్యారు. మిగితా పరీక్షలు మాత్రం యథావిధిగానే జరిగాయి.


