డయాలస్ట్రెస్..!
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు, బాధితులు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత
పెరుగుతున్న కిడ్నీ బాధితులు
● తక్కువ సెంటర్లతో విడతల వారీగా రక్తశుద్ధి ● అందుబాటులో లేని నెఫ్రాలజిస్టులు ● నామమాత్రంగా వైద్య సేవలు
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధితో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు, నియంత్రలేని జీవన శైలిలో మార్పు, అవగాహన లేక కిడ్నీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. బీపీ, షుగర్ బారిన పడిన వారిలోనూ ఈ సమస్యలు పెరుగుతుండడంతో డయాలసిస్ బాధితులు ఎక్కువవుతున్నారు. అయితే డయాలసిస్ బాధితులకు ఉమ్మడి జిల్లాలో బాధితులకు తగినన్ని డయాలసిస్(రక్తశుద్ధి) కేంద్రాలు లేక హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రక్తశుద్ధి చేయించుకుంటే గానీ వారి జీవనం సాగే పరిస్థితి కనబడడం లేదు.
ఉమ్మడి జిల్లాలో 600 మంది..
కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ డయాలసిస్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకుని రక్తశుద్ధి చేయించుకుంటున్న వారి సంఖ్య 600 మంది వరకు ఉన్నారు. అయితే ఇక్కడ అవకాశం లేనివారు హైదరాబాద్ వంటి నగరాలకు తరలివెళ్తున వారి సంఖ్య దాదాపుగా అదే సంఖ్యలో ఉండి ఆర్థికంగా నష్టపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 68 డయాలసిస్ మిషన్లు ఉండగా.. 340 మంది బాధితులు రక్త శుద్ధి చేయించుకుంటుండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 56 మిషన్లకు గాను 260 మంది బాధితులు విడతల వారీగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో తగినన్ని డయాలసిస్ కేంద్రాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బెడ్డు ఖాళీగా ఉంటే వారి వంతు వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ బెడ్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పేరు బాధితులు డయాలసిస్ మిషన్లు
ఖమ్మం 146 22
సత్తుపల్లి 38 05
కొత్తగూడెం 63 10
భద్రాచలం 52 10
పాల్వంచ 40 10
మణుగూరు 32 05
ఇల్లెందు 30 08
చర్ల 03 05
ఉమ్మడి జిల్లాలో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుసంధానంగా కొత్తగూడెం, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఖమ్మం ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్లో 22 మిషన్లు ఉండగా, 146 మంది, కొత్తగూడెం ఆస్పత్రిలో 10 మిషన్లు ఉండగా.. 63 మంది షిఫ్టుల వారీగా డయాలసిస్ చేయించుకుంటారు. అంతేకాక సత్తుపల్లిలో 38 మంది, భద్రాచలంలో 52, పాల్వంచలో 40, మణుగూరులో 32, అశ్వారావుపేట 23, ఇల్లెందు 30, చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు డయాలసిస్ చేయించుకుంటారు. అయితే ఉమ్మడి జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఉన్నా.. ఒక్క నెఫ్రాలజీ వైద్య నిపుణుడు లేకపోవడంతో సాధారణ ఫిజీషియన్ సమక్షంలోనే వైద్య పరీక్షలు అందిస్తూ నెట్టుకొస్తున్నారు. దీంతో సరైన వైద్య సేవలు అందక బాధితులు ఎక్కువ కాలం బతకలేకపోతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో మృత్యువాత పడే వారి సంఖ్య ఎక్కువ అవుతుండడం అందోళన కల్గిస్తోంది.


