రింగ్ లీడర్..!
● మున్సి‘పోల్స్’లో మంత్రి పొంగులేటి కీలక పాత్ర ● ఉమ్మడి ఖమ్మంతో పాటు వరంగల్లో ప్రచారం ● 249 వార్డుల్లో ప్రచారం.. 174 చోట్ల కాంగ్రెస్ గెలుపు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక తక్కువ వ్యవధిలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సుడిగాలి ప్రచారం చేశారు. పది రోజుల్లో రెండు ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధి 249 వార్డుల్లో ప్రచారం చేయగా 174 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
ఖమ్మం టూ ఓరుగల్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో మంత్రి ప్రచారం చేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల ప్రచారానికి కూడా హాజరయ్యారు. మంత్రి ప్రచారం చేసిన ఏదులాపురం మున్సిపాలిటీలో 24 వార్డులు, కల్లూరులో 12, సత్తుపల్లిలో 17, అశ్వారావుపేటలో 17, ఇల్లెందులో 19వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్లోని భూపాలపల్లి మున్సిపాలిటీలో 16 వార్డులు, పరకాలలో 13, స్టేషన్ఘన్పూర్లో 13 వార్డుల్లో విజయంతో పుర పీఠాలు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే లేని కొత్తగూడెం కార్పొరేషన్లో ఒంటరిగా పోటీ చేయగా 22 డివిజన్లు పార్టీకి దక్కాయి.
అభివృద్ధిని ప్రస్తావిస్తూ..
ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పథకాలను ఓటర్లకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్గదర్శకత్వంలో తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుందని వెల్లడించారు. స్థానిక పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కలుపుకుంటూ మంత్రి చేసిన ప్రచారంతో మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కు దక్కాయని నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


