బాల్యం నుంచే విలువల బోధన
● ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’పై అవగాహన తప్పనిసరి ● జాతీయ బాలికల దినోత్సవంలో అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మంమయూరిసెంటర్: చిన్నతనం నుంచే పిల్లల్లో విలువలు పెంపొందించేందుకు అందరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా మహిళా సాధికారత కేంద్రం, మహిళా–శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో బుధవారం నిర్వహించగా ఆమె మాట్లాడారు. జిల్లాలో ‘చిన్నారి’ పేరిట కార్యక్రమాన్ని రూపొందించి మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా వేయి విద్యాసంస్థల్లో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించామన్నారు. ఈవిషయమై తల్లిదండ్రులు కూడా వివరించాలని, మగ, ఆడపిల్లలకు సమానంగా ఇతరులను ఎలా గౌరవించాలో నేర్పాలని సూచించారు. అలాగే, పిల్ల లకు సెల్ఫోన్ అలవాటు చేయొద్దన్నారు. తొలుత బాలల సదనం పిల్లలు చేసిన స్వాగతం నృత్యం, అంగన్వాడీ ఖమ్మం అర్బన్, రూరల్ ప్రాజెక్టుల పిల్లలకు వెల్ బేబీ షో, గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై కేజిబీవీ విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈసీఆర్ అమలుపై ప్రత్యేక శ్రద్ధ
చింతకాని: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్)పై ప్రత్యేక వ్రద్ధ వహిస్తూ పిల్లల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. చింతకాని మండలం లచ్చగూడెం పాఠశాలలో ఈసీఆర్ అమలును పరిశీలించిన ఆమె ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈఓ ఎస్.రామారావు, కాంప్లెక్స్ హెచ్ఎం జగదీష్ పాల్గొన్నారు.


