రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలి
● లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండగా మారుస్తాం ● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్
సూపర్బజార్(కొత్తగూడెం): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతంగా పెంచాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విస్మరిస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే బీసీ సమాజం అడ్డుకొని తీరుతుందని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్లు పెంచేలా ఈనెల 28నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచి చట్టం చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అకినీడు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు తోట దేవీప్రసన్న, పి.వీరబాబు, మడత వెంకట్గౌడ్, మిట్టపల్లి సాంబయ్య, సోమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


