నోటే.. ఓటయింది !
ఎక్కడా ఆనాటి స్ఫూర్తి?
ఎన్నికల అర్థమే మారిపోతోంది..
పోటాపోటీగా తాయిలాల పంపిణీ చేస్తున్న అభ్యర్థులు
మాజీ సర్పంచ్ల మనోగతం
వైరా: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని చెబుతారు. పల్లెలు అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను చూస్తే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు గ్రామాల అభివృద్ధి ఏ మేరకు పాటుపడతారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తికాగా, మూడో దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. మొదటి రెండు దశల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీ పడిన అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బుతో పాటు మద్యం, మాంసం పంపిణీ చేరారని చెబుతున్నారు. ఇక మూడో విడత అభ్యర్థులు సైతం తామేం తీసిపోమన్నట్లుగా అదే బాటలో పయనిస్తున్నారు.
గ్రామాల్లో ఎన్నికలంటే సహజంగానే సందడి ఉంటుంది. కానీ ఆ సందడి అభివృద్ధి హామీలు ఇవ్వడంపై కాకుండా పరస్పర దూషణలు, పోటాపోటీగా తాయిలాలు పంపిణీ చేసేలా ఉండడంపై గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ఎన్నికల విధానం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాల్సిందిగా పోయి ‘నోటుస్వామ్యం’ మాదిరి వర్ధిల్లుతోందని చెబుతున్నారు. డబ్బు, మద్యమే ఎన్నికలను శాసిస్తున్నాయని, పార్టీ రహిత గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులను అద్ది అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.10వేలు ఇచ్చారని, ఇంకో చోట వరుసగా కొన్నిరోజుల పాటు ఇంటికే మటన్, చికెన్ పంపిణీ చేశారనే ప్రచారంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు 10 – 15 ఏళ్ల క్రితం సర్పంచ్లుగా గెలిచిన వారిని పలకరించగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.


