అవినీతి పరులపై
● ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్, క్యూ ఆర్ కోడ్తో స్టిక్కర్లు ● ప్రభుత్వ కార్యాలయాల్లో అంటిస్తూ ప్రచారం ● సెల్ఫోన్లో స్కాన్ చేసి ఫిర్యాదుకు అవకాశం
ఫిర్యాదు చేయండి
పాల్వంచరూరల్: చట్టప్రకారం ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటు చేసింది. ఏసీబీ జిల్లాలో ఇటీవల దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేసి, జైలుకు పంపుతోంది. ఈ క్రమంలోనే సులువుగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూర్ కోడ్ స్కానర్లకు సంబంధించిన స్టిక్కర్లు ఏర్పాటు చేసింది. స్మార్ట్ఫోన్ ద్వారా క్యూర్ కోడ్ను స్కాన్చేసి సులభంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
2025లో 20 కేసులు నమోదు
పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఫారెస్టు, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి అధికంగా జరుగుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈఏడాది జనవరి నుంచి ఈనెల 9వ తేదీ వరకు వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 కేసులు నమోదు చేశారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను కటకటాల్లోకి పంపారు. తద్వారాఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నట్లు తేలింది. రెవెన్యూ శాఖలో ఆరు, పోలీసుశాఖలో మూడు, రిజిస్ట్రేషన్, వ్యవసాయశాఖల్లో రెండు చొప్పున, మైనార్టీ సంక్షేమం, ఇరిగేషన్, ఫారెస్ట్, మున్సిపల్, కార్మిక, ఎక్సెజ్, విద్యాశాఖల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఇలా ఫిర్యాదు చేయవచ్చు
ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసులో ఏసీబీ అధికారులు అంటించిన స్టికర్(క్యూర్ కోడ్) స్కాన్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలను నమోదు చేసి సెండ్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది. టోల్ఫ్రీ నంబర్ 1064, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేష్ 91543 88981కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో ఏసీబీ అధికారులు సంప్రదించి వివరాలు సేకరించుకుని ఫిర్యాదుదారుని పేర్లను రహస్యంగా ఉంచుతారు. కాగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
పనుల కోసం అధికారులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం. అధికారులు ఇబ్బందులు పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరైనా వదిలిపెట్టం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ఫిర్యాదులు చేయవచ్చు. – వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ
అవినీతి పరులపై


