‘క్లరికల్’ పరీక్ష ఊసేది..?
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ రాతపరీక్ష కోసం ఇంటర్నల్ అభ్యర్థులు 20 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రిక్రూట్మెంట్సెల్ జీఎంలు ముగ్గురు మారినా పరీక్ష నిర్వహణ ఊసే లేదు. దీంతో అర్హులైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణివ్యాప్తంగా 8 విభాగాల్లో సుమారు 360 పోస్టుల భర్తీకి యాజమాన్యం 2014, మార్చిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విభాగాల్లో రాత పరీక్ష నిర్వహించి, భర్తీ ప్రక్రియ పూర్తిచేసింది. క్లరికల్ విభాగంలో జూ నియర్ అసిస్టెంట్ పోస్టులు 177 ఉండగా, 6,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న అంతర్గత ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్ విడుదల చేశాక రిక్రూట్మెంట్ సెల్ జీఎంలు ముగ్గురు మారారు. డైరెక్టర్(పా)గా కూడా ముగ్గరు మారారు. అయినా పరీక్ష మాత్రం నిర్వహించలేదు.
కాలయాపన చేస్తున్న యాజమాన్యం
సంస్థలో 2018 నుంచి సుమారు 18 వేల మంది మెడికల్ అన్ఫిట్ అయ్యారు. వారి వారసులు(డిపెండెంట్లు) సుమారు 16వేల మంది ఉద్యోగాల్లో చేరారు. వారిలో 98శాతం డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, కంప్యూటర్పై అవగాహన కలిగినవారు ఉన్నా రు. ఈ నేపథ్యంలో డిపెండెంట్లకు బదిలీ వర్కర్గా పోస్టింగ్ ఇచ్చినా యాజమాన్యం క్లరికల్ పనులు చేయిస్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి రాత పరీక్ష నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
గొంతుకోసుకున్న వ్యక్తికి శస్త్రచికిత్స
పాల్వంచ: కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయన ప్రాణం కాపాడారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని నూడుల్స్ పాయింట్లో వంట మాస్టర్గా పనిచేసే వెస్ట్ బెంగాల్కు చెందిన 35 ఏళ్ల బిశాల్ తమంగ్ మంగళవారం సాయంత్రం కత్తితో గొంతు కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ సమాచారం అందడంతో బాధితుడిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని జిల్లా ప్రధాన ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి.రవిబాబు సూచించారు. ఈఎన్టీ వైద్యుడైన రవిబాబు అక్కడకు చేరుకుని, జనరల్ సర్జన్ సోమరాజు దొర, మత్తు వైద్య నిపుణుడు రాంప్రసాద్, సిబ్బందితో కలిసి ఆపరేషన్ విజయవంతం నిర్వహించారు. అనంతరం ఐసీయూ సేవల కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. కాగా, శస్త్రచికిత్స చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.


