
సాగుతున్న సమ్మె
సమస్యలు పరిష్కరించాలి..
● దసరా సెలవుల అనంతరం రేపు తెరుచుకోనున్న హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు ● ఆందోళన బాటలో కుక్లు, వర్కర్లు ● విద్యార్థులకు తప్పని ఇక్కట్లు
ఖమ్మంమయూరిసెంటర్: తమ సమస్యలు పరి ష్కరించాలంటూ గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో పనిచేస్తున్న రోజువారీ, ఔట్సోర్సింగ్ కార్మి కులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. పెండింగ్ వేతనాలు విడుదలైనా, ప్రధాన సమస్యల పరి ష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని కార్మి కులు ప్రకటించారు. వేతన బకాయిలు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, తమ డిమాండ్లు నెరవేరే వరకు విధులు బహిష్కరిస్తామని తేల్చిచెబు తున్నారు. దీంతో జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వంటచేసే వర్క ర్లు లేక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దసరా సెలవులతో దాదాపు 15 రోజుల పాటు హాస్టళ్లు మూతపడి ఉండడంతో ఈ సమ స్య పెద్దగా కనిపించకపోయినా.. సెలవుల అనంతరం కార్మికుల సమ్మె ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతుండడం గమనార్హం.
ఎప్పుడూ లేని విధంగా..
గతంలో వేతనాలు, సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె చేసినా అది నాలుగైదు రోజుల్లోనే ముగిసేది. కానీ ఈసారి కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో మంత్రుల క్యాంపు కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టగా.. రాష్ట్ర అధికారులు 6 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేశారు. అయితే పెండింగ్ వేతనాలే కాదని, పనికి తగిన వేతనం ఇవ్వాలని, జీతాలు తగ్గిస్తూ తీసుకొచ్చిన జీఓలను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మె కొనసాగిస్తున్నారు. కార్మికుల సమ్మెకు కార్మిక, విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో.. కనీస సమస్యలు పరిష్కారం అయ్యేవరకై నా పోరు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రభుత్వ స్పందనపై నిరీక్షణ..
పెండింగ్ వేతనాలు విడుదలైన నేపథ్యంలో, ప్రభుత్వం మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై ఎంతవరకు దృష్టి సారిస్తుందనే దానిపై కార్మికులు, విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. వేతన బకాయిల విడుదల కొంత సానుకూల పరిణామమైనా, కార్మికులు తమ భవిష్యత్కు భద్రత కోరుకుంటున్నారు. సమస్యల పరిష్కరించేలా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వారిపై ఒత్తిడి..
జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పని చేసే డెయిలీ వేజ్ వర్కర్లు 77 మంది, ఔట్ సోర్సింగ్ వర్కర్లు 45 మంది సమ్మె చేస్తున్నారు. వీరంతా సమ్మెలోకి వెళ్లిన రోజు నుంచి అక్కడ వారు చేసే పనుల కోసం రోజు వారీ కూలీలను ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు వసతిగృహ సంక్షేమ అధికారులకు సూచించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అడ్డాపై పని చేసే కూలీలు రోజువారీ కూలీ రూ.600 నుంచి రూ.1,000 వరకు డిమాండ్ చేస్తుండడంతో వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. అసలే బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు రోజు వారీ వేతనాలు చెల్లించి కూలీలను ఎక్కడి నుంచి తీసుకురావాలని మథనపడుతున్నారు. వసతిగృహాల్లో విద్యార్థులకు వంట చేసి పెట్టడం, అధికారులు ఆదేశాలను పాటించడంలో కొంతమంది వార్డెన్లు ఒత్తిడికు లోనవుతున్నారనే చర్చ జరుగుతోంది.
ఎన్నో ఏళ్లుగా వసతిగృహాల్లో పని చేస్తున్న మాకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇచ్చే జీతమే తక్కువైనా అవి కూడా నెలనెలా ఇవ్వడం లేదు. నాలుగు డిమాండ్లతో మేం ఐక్యంగా సమ్మె చేస్తున్నాం. అవి పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. – బాదావత్ లక్ష్మా,
కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి

సాగుతున్న సమ్మె