మధిర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో నిర్వహించిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ఉత్తమ ప్రదర్శనతో అవార్డులు సాధించారు. గతనెల 27నుంచి ఈ నెల 2వరకు జరిగిన పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ప్రదర్శించిన కస్తూరి తిలకం తృతీయ బహుమతి సాధించింది. అలాగే, డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజుకు ఉత్తమ దర్శకుడు, చింతామణి పాత్ర ధరించిన విజయరాణికి ప్రత్యేక జ్యూరీ బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో సాంస్కతిక కళా కేంద్రం ఏర్పాటుకాగా, అక్కడ సాధన చేసే అవకాశం దక్కిందని.. తద్వారా బహుమతులు సాధిస్తున్నామని తెలిపారు. అలాగే, చిలువేరు శాంతయ్య, ఇనపనూరి వసంత్, కిషోర్ రెడ్డి, నరాల సాంబశివారెడ్డి, ఎర్రగుంట రాజేశ్వరరావు, రామవరపు ప్రసాద్ తదితరులు కూడా భట్టికి కృతజ్ఞతలు తెలిపారు.
7న అండర్–19
క్రీడా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల ఆర్చరీ, రెజ్లింగ్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. అలాగే, ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 ఖో–ఖో బాలబాలికల జట్ల ఎంపిక కల్లూరు మినీ స్టేడియంలో 11వ తేదీన జరుగుతుందని మూసీ కలీం తెలిపారు.
నేడు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–15 బాలబాలికల చెస్ జట్లను శనివారం ఎంపిక చేయనున్నట్లు చెస్ అసోసియేషన్ బాధ్యులు సీహెచ్.గోపికృష్ణ, జ్యోత్స్న తెలిపారు. ఆసక్తి ఉన్న వారు క్రీడాకారులు 94401 62749, 83091 34971 నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే సమయాన వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు.
అమ్మవారికి రూ.2.50లక్షల ఆభరణాలు
వైరా: వైరా హనుమాన్బజార్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ కోసం డాక్టర్ ఓర్సు వెంకటేశ్వర్లు – తైవశ్రీ దంపతులు రూ 2.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ చైర్మన్ వేముల శివకృష్ణ సత్కరించారు. అర్చకుడు రాజశేఖర్తో పాటు రాము, బాలయ్య, ఆంజనేయులు, ఏడుకొండలు, తిరుపతి, శ్రీనివాసరావు, ఓర్సు శ్రీను, చిన్నరాములు, రాంబాబు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లాకు కేంద్రీయ
విద్యాలయం మంజూరు
సూపర్బజార్(కొత్తగూడెం): పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుచేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకే ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రానికి నాలుగు విద్యాలయాలు కేటాయించగా, అందులో ఒకటి జిల్లాకు దక్కింది. ఎంపీ చొరవ, ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఆదివాసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కిన్నెరసానిలో
దసరా సందడి
రెండురోజుల పాటు భారీ ఆదాయం
పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో దసరా పర్వదినాన పర్యాటకులు సందడి చేశారు. గురు, శుక్రవారాల్లో జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. ఈ రెండు రోజుల్లో 1,795 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.1,07,515, 1,350 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.68,850 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మధిర కళాకారులకు బహుమతులు
మధిర కళాకారులకు బహుమతులు