
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ముదిగొండ: ముదిగొండ, చింతకాని మండలాల్లో మున్నేటి నుంచి ఇసుక అక్రమ తరలింపు జరుగుతున్న అంశంపై ‘సాక్షి’లో వరుస కథనాలతో పోలీసు అధికారులు స్పందించారు. ఇప్పటికే ఇసుక రీచ్ల వద్ద, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యాన ముదిగొండ సీఐ ఓ.మురళి ఆధ్వర్యాన ఆదివారం ముదిగొండ మండలం మల్లారం చెక్ పోస్టు తనిఖీ చేయగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఏపీలోని వత్సవాయి మండలం, మల్కాపురం నుంచి ముదిగొండ మండలానికి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
పెండింగ్ బిల్లులు
సత్వరమే చెల్లించాలి
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంగా ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు రిటర్మెంట్ బెనిఫిట్లు అందకపోగా, జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ, మెడికల్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టారని తెలిపారు. ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామన్న హామీ కూడా నెరవేరడం లేదని తెలిపారు. ఇకనైనా పెండింగ్ బిల్లులు విడుదల చేయడమే కాక సీపీఎస్ను రద్దు చేయాలని, మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలంటూ తీర్మానించారు. యూనియన్ నాయకులు మోత్కూరి మధు, వెంకటనరసయ్య, యలమంచి వెంకటేశ్వర్లు, ఆర్.రంగారావు, చిత్తలూరి ప్రసాదరావు, బ్రహ్మారెడ్డి, విజయ, అమృత్కుమార్, జయమ్మ, కొమ్ము శ్రీనివాసరావు, పుట్లూరు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో
బాలిక ప్రసవం
నర్సు ద్వారా శిశువు విక్రయానికి యత్నం?
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం క్రైం: ఓ మైనర్ బాలిక ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ తండాకు చెందిన సదరు బాలిక గర్భం దాల్చగా, నెలలు నిండడంతో కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం చేర్పించినట్లు సమాచారం. అక్కడ బాలిక ఆడశిశువుకు జన్మనివ్వగా, పాపను తీసుకెళ్లేందుకు వారు నిరాకరించారని తెలిసింది. దీంతో శిశువును అమ్మేందుకు ఆస్పత్రి నర్సు ద్వారా బేరసారాలు సాగించినట్లు సమాచారం. ఈవిషయం బయటకు పొక్కడంతో ఐసీడీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపట్టారు. శిశువును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే, చివరకు బాలిక బంధువులే తీసుకెళ్తామని చెప్పినట్లు సమాచారం. కాగా, బాలిక గర్భానికి అదే తండాకు చెందిన యువకుడు కారణమని గుర్తించి ఖమ్మం వన్టౌన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశాక, మరిపెడ పోలీసుస్టేషన్కు బదలాయించారు. అయితే, శిశువు అమ్మకం విషయమై పై వివరణ కోరేందుకు బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు.
విద్యుదాఘాతంతో
ఎలక్ట్రీషియన్కు గాయాలు
సత్తుపల్లిరూరల్: ట్రాన్స్ఫార్మర్ వద్ద సరఫరా నిలిపివేసేందుకు ప్రయత్నించిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్కు విద్యుదాఘాతంతో గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ధర్మసోత్ రామకృష్ణ ప్రైవేట్ ఎలక్ట్రీషన్గా పని చేస్తున్నాడు. గ్రామంలోని ఓ రైతు పొలంలో మోటారు ఫ్యూజ్ పోయిందని చెప్పగా, ఆదివారం మరో వ్యక్తితో కలిసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర సరఫరా నిలిపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయాన రామకృష్ణ మెడలో ఉన్న గొలుసు 33/11 కేవీ వైర్కు తాకగాషాక్తో ఆయన మెడ భాగం కాలిపోయింది. దీంతో 108 సిబ్బంది గొల్లమందల కృష్ణ, కట్టం మహేష్ చేరుకుని ప్రాథమిక చికిత్స చికిత్స అనంతరం సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం