
కళ్ల ముందే మార్కెట్..
ఖమ్మంపై ఒత్తిడి తగ్గించేందుకు..
చెక్పోస్టులు, కోల్డ్ స్టోరేజీ ఫీజుల వసూళ్లకే పరిమితం
ఈ పంట సీజన్లోనైనా ప్రారంభించాలని రైతుల డిమాండ్
ఇంకో పక్క మత్కేపల్లి మార్కెట్
నిర్మాణానికి ఎదురుచూపులు
దూరాభారం తగ్గుతుంది..
అందుబాటులోకి తేవాలి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. గతంలో పాలకవర్గం సైతం ఏర్పడినా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకపోగా కేవలం చెక్పోస్ట్, కోల్డ్ స్టోరేజీ ఫీజుల వసూళ్లకు పరిమితమైంది. మార్కెట్లో కార్యకలాపాలు జరగాలంటే 50 మందికి పైగా కమీషన్దారులు ఉండాలని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల పరిధి రైతుల కోసం నిర్మించిన ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలైతే రైతుల ఇబ్బందులు తీరడమే కాక ఖమ్మం వ్యవసాయ మార్కెట్పై ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుతం ఖమ్మంలో మోడల్ మార్కెట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన మద్దులపల్లి మార్కెట్ను ఈ పంట సీజన్లోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు మరింత అందుబాటులో..
ఉమ్మడి జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్లు ఉండగా.. ఇటీవల చింతకాని, ముదిగొండ మండలాలకు చింతకాని మండలం మత్కేపల్లి వద్ద మరో మార్కెట్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడ స్థల సేకరణ ప్రక్రియ నడుస్తోంది. భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదించగా నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, వైరా, నేలకొండపల్లి, కల్లూరు, సత్తుపల్లి, ఏన్కూరు, మద్దులపల్లి మార్కెట్ల పరిధిలో 21 చెక్పోస్టులు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, దమ్మపేట వ్యవసాయ మార్కెట్లు, 18 చెక్పోస్టులు పనిచేస్తున్నాయి. అయితే, రైతులకు మరింత చేరువ చూసేలా కొత్త మార్కెట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు.
నిర్మాణం పూర్తయినా..
మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో షెడ్లు, కార్యాలయాల భవనాల నిర్మాణం పూర్తయింది. గతంలోనే పాలకవర్గాన్ని సైతం నియమించినా కార్యకలాపాలు మాత్రం మొదలుకాలేదు. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిర్మాణ పనులు జరుగుతున్నందున మద్దులపల్లిలో లావాదేవీలు మొదలుపెడితే ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల నుంచే కాక జిల్లాలోని ఇతర ప్రాంతాలు, పక్క జిల్లాల రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ అవసరమైన 50 మందికిపైగా కమీషన్దారులను నోటిఫై చేయకపోవడం, ఇతర కారణాలతో ముందడుగు పడడం లేదు. ఫలితంగా ఇప్పటి వరకు మార్కెట్ ఫీజు, చెక్పోస్ట్ ఫీజు మాత్రమే ఆదాయం వస్తోంది.
మత్కేపల్లికి ముహూర్తం ఎప్పుడో..
ఖమ్మం మార్కెట్ పరిధిలో ఉన్న చింతకాని, నేలకొండపల్లి మార్కెట్ పరిధిలోని ముదిగొండ మండలాన్ని విడదీసి నూతనంగా చింతకాని మండలం మత్కేపల్లిలో మార్కెట్ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఆగస్టు 2న జీఓ విడుదల చేసింది. ఇందుకోసం 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్కు ఆదేశాలు అందాయి. తొలుత మత్కేపల్లి రెవెన్యూ పరిధి 41వ సర్వేనెంబర్లో ఎనిమిది ఎకరాలను గుర్తించారు. మిగతా భూమిని కూడా గుర్తించి నిర్మాణాలు చేపడితే రెండు మండలాల రైతులకు మేలు జరగనుంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాతోపాటు సమీప జిల్లాలు, ఏపీ నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొస్తారు. ఈ మార్కెట్పై ఒత్తిడి తగ్గించేందుకు 2018లో ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలో మార్కెట్ నిర్మాణాన్ని రూ.19.90 కోట్లతో 23.28 ఎకరాల్లో ప్రారంభించారు. ఇక్కడ ఖమ్మంరూరల్ మండలంలోని 19 గ్రామాలు, తిరుమలాయపాలెం మండలంలోని 25 గ్రామాల రైతులు పండించే మిర్చి, పత్తి, మొక్కజొన్న, పెసలు, కందిపప్పు, మినుములు కొనుగోలు చేయాలనేది అంచనా.
అయినా.. మద్దులపల్లిలో మొదలుకాని కొనుగోళ్లు
మద్దులపల్లి మార్కెట్ అందుబాటులోకి వస్తే ఖమ్మం వెళ్లాల్సిన అవసరం ఉండదు. దూరాభారం తగ్గుతుంది. రవాణా ఖర్చులు కలిసొస్తాయి. ఇక్కడ అన్ని పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలి.
– పల్లె రమేష్, రైతు, పోచారం,
కూసుమంచి మండలం
మా పంటలు అమ్ముకోవాలంటే ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. మద్దులపల్లిలో మార్కెట్ మంజూరు కావడంతో సంతోషించాం. ఇక్కడ నిర్మాణాలు కూడా పూర్తయినందున మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా మా ప్రాంత రైతులకు కలిసి వస్తుంది.
– నామ అప్పారావు, పాపాయిగూడెం,
తిరుమలాయపాలెం మండలం

కళ్ల ముందే మార్కెట్..

కళ్ల ముందే మార్కెట్..

కళ్ల ముందే మార్కెట్..