
కమ్యూనిజానికి అంతం లేదు..
సూపర్బజార్(కొత్తగూడెం): కమ్యూనిజానికి అంతం లేదని.. కమ్యూనిస్టులు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభను పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా అధ్యక్షతన నిర్వహించారు. సురవరం చిత్రపటానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ సురవరం విద్యార్థి దశ నుంచే కమ్యూనిజాన్ని నమ్మి నిరంతర పోరాటాలు చేశారని తెలిపారు. కాగా, 2026 మార్చి వరకు మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన సరికాదని, మావోయిస్టు ప్రతి రక్తపు బొట్టు నుంచి తిరిగి ఉద్భవిస్తారని వ్యాఖ్యానించారు. వివిధ పార్టీల నాయకులు బాగం హేమంతరావు, ఆవునూరి మధు, అన్నవరపు సత్యనారాయణ, నాగా సీతారాములు, కంచర్ల చంద్రశేఖర్రావు, కకె.అనంతరాములు, ఎస్.అనుదీప్, పసుపులేటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.