
బెటాలియన్ కానిస్టేబుల్ బలవన్మరణం
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగారం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ కుటుంబ కలహాలకు తోడు మద్యానికి బానిసవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన అల్లం బాలరాజు(40) సత్తుపల్లి మండలం బేతుపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటూ గంగారం బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏడాది క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్య, పిల్లలతో కలిసి పుట్టింటికి ఉంటుంది. ఆపై మద్యానికి బానిసైన బాలరాజు మద్యం మత్తులోనే రెండు రోజుల క్రితం నివాసముండే గదిలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో బెటాలియన్ సిబ్బంది పరిశీలించడంతో విషయం వెలుగు చూసింది. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
ఖమ్మం క్రైం: ఖమ్మంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్దగోపతికి చెందిన గుండ్ల రామకృష్ణ(22) ఖమ్మంలోని మొబైల్ షాప్లో పనిచేస్తుండగా, స్వగ్రామానికి బైక్పై వెళ్లే సమయాన వైరా వైపు నుంచి బైక్పై వస్తున్న సామినేని చంద్రమోహన్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రామకృష్ణకు చికిత్స చేయిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై ఆయన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడాపాఠశాలలో మూడేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మోకాళ్ల పాపారావు(50) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పాటిమీదగుంపునకు తరలించారు. పాఠశాల హెచ్ఎం రామారావు, తోటి ఉపాధ్యాయులు రూ. 30 వేల ఆర్థికసాయాన్ని మృతుడి భార్యకు అందజేశారు.
విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స
కల్లూరు: కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో సోమవారం అల్పాహారం తిన్నాక 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఇందులో ఐదుగురికి మంగళవారం కల్లూరు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. వైద్యులు రమేష్, నవ్యకాంత్ వారిని పరీక్షిచి సూచనలు చేశారు. కాగా, మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పసుమర్తి చందర్రావు, భాగం ప్రభాకర్ విద్యార్థినులను పరామర్శించడమే కాక హాస్టల్లో పరిశీలించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
రెండు రోజుల తర్వాత గుర్తించిన వైనం

బెటాలియన్ కానిస్టేబుల్ బలవన్మరణం