
సంక్షోభంలో లారీల యాజమాన్యాలు
సత్తుపల్లి: సత్తుపల్లికి చెందిన లారీల యాజమాన్యాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో లారీలు ఉండగా.. వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. సత్తుపల్లి కేంద్రంగా బొగ్గు రవాణాపై యాజమానులు, డ్రైవ ర్లు, క్లీనర్ల కుటుంబాలు జీవనం సాగిస్తుండగా.. ప్రస్తుతం లోడింగ్ లేక వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతోంది.
ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి..
ఏడాది క్రితం వరకు 650 బాడీ లారీలు, 100 టిప్పర్లతో కలిపి 750 లారీలు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 450కు పడిపోయింది. లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వకుండా ఆర్సీహెచ్పీ(రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)కు రవాణా చేస్తుండడంతో వారి ఉపాధిపై దెబ్బపడుతోంది. ఫైనాన్స్ కిస్తీలు, ట్యాక్స్లు కట్టలేక లారీ యజమానులు దిగులుతో మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇదే సమయాన ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కొందరైతే ఉన్న ఇళ్లను అమ్మేసి లారీల ఫైనాన్స్ చెల్లించాక ఆ లారీలను అమ్ముకుని జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
లోడింగ్ను అడ్డుకుని..
బొగ్గునిల్వలు పేరుకుపోవడం, నిప్పు అంటుకుంటుందనే కారణంతో 1.50 లక్షల టన్నుల బొగ్గును రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ)కు తరలించేందుకు గతేడాది మే 24న తాత్కాలికంగా అనుమతి ఇచ్చారు. కానీ ఆ రవాణా నేటికీ ఆగడం లేదు. రోజుకు 10వేల టన్నులు రవాణా జరుగుతుండగా.. మూడు నెలల్లో ఆర్సీహెచ్పీకి పూర్తికావాల్సిన రవాణాను పొడిగిస్తుండడంతో స్థానిక లారీలకు లోడింగ్ దక్కడం లేదు. దీంతో యజమానులు మూడు రోజులుగా రవాణాను అడ్డుకుంటూ ఆందోళన చేపడుతున్నారు. అయినా ఫలితం లేకపోగా, సోమవారం చర్చలు జరిపినట్లు తెలిసినప్పటికీ ఫలితం రాలేదని సమాచారం.
ఆర్సీహెచ్పీకు
బొగ్గు రవాణా అడ్డగింత
మూడు రోజులుగా కొనసాగుతున్న
ఆందోళన