
ప్రజల్లో విశ్వాసం పెంచేలా వ్యాపారం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల్లో విశ్వాసం పెరిగేలా మహిళా సంఘాలు వ్యాపారం నిర్వహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని మహిళా మార్ట్ను బుధవారం సందర్శించిన ఆయన నిర్వహణలో అనుభవాలు, ఇంకా ఏమైనా సాయం కావాలి అని ఆరా తీశాక మాట్లాడారు. వినియోగదారుల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా ఉత్పత్తులు సమకూరిస్తే వ్యాపారం పెరుగుతుందని తెలిపారు. కల్తీలేని నాణ్యమైన పదార్థాలు తక్కువ ధరకు మహిళా మార్ట్లో లభిస్తాయనే నమ్మకం ఏర్పర్చాలని చెప్పారు. ఏమేం అమ్మాలన్న విషయాన్ని జిల్లా మహిళా సమాఖ్యలో నిర్ణయించుకుని, వచ్చే లాభాలతో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మార్ట్కు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్ కలెక్టరేట్ నుంచి అందిస్తామని కలెక్టర్ చెప్పారు. ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు కాకుండా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలని సూచించారు. అనంతరం ఆయన కొంత సామగ్రి కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించారు.
●ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పరిశీలించాక ఆయన భధ్రతపై సిబ్బందికి సూచనలు చేశారు.ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు సీహెచ్.స్వామి, డీటీ అన్సారీ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
●ఖమ్మంవన్టౌన్: బాల కార్మికరహిత జిల్లాగా ఖమ్మంను తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. ఈనెల 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ ఫర్ ఇంటిగ్రెటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ రూపొందించిన వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడమే కాక బాలలను పనిలో పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏదైనా పని ప్రదేశం వద్ద ఎక్కువ మంది పిల్లలు ఉంటే అక్కడే పాఠశాల ఏర్పాటు చేయిస్తామన్నారు. అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి, బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ భారతీరాణి, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్రెడ్డి, డీఎల్సీఓ విజయభాస్కర్రెడ్డి, బాలల పరిరక్షణాధికారి విష్ణువందనతో పాటు ఉదయ్భాస్కర్, కకె.శ్రీనివాస్, రవీందర్, రాందాస్, రవిచంద్ర, సమ్రీన్ పాల్గొన్నారు.
మహిళా మార్ట్ను సందర్శించిన
ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్