
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ తెలిపారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు మధ్యాహ్నం భోజనంలో నాణ్యత పెంచి కార్మికుల వేతనం, బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని కోరారు. ఇదే సమయాన ఉపాధ్యాయులు బాధ్యతగా తల్లిదండ్రులను కలిసి పిల్లలను చేర్పించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, వెంగళరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి మనోహర్రాజుతో పాటు ముత్తయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎస్జీఎఫ్
టేకులపల్లి: ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఎస్జీఎఫ్) ఉమెన్స్ గిల్డ్ ఆధ్వర్యాన టేకులపల్లి మండలం బొమ్మనపల్లిలో బుధవారం హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. అనంతరం హెచ్ఎం మంగీలాల్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈకార్యక్రమంలో పొగాకు లక్ష్మి, జర్పుల పద్మ, లోగాని శ్రీనివాస్, మహమ్మద్ ఖాసిం, ఎం.జ్యోతిరాణి, నీరజా షారోన్, సరోజ, పార్వతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
కూసుమంచి: కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన రైతు దుస్సా ముత్తయ్య (55) బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానిక ఏటి ఒడ్డున పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు షాక్ తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడి ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
జారి పడిన పెయింటర్...
ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లా బోనకల్ వాసి, ఖమ్మం వైఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న పెయింటర్ గంధం వంశీ(30) బుధవారం ప్రమాదవశాత్తు జారి పడగా మృతి చెందాడు. ఇంట్లో ఆయన ఫోన్ మాట్లాడుతూ నీళ్లు గమనించక కాలు వేయడంతో జారి పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయమై మృతి చెందగా కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు.

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం