
కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి
● సివిల్ సప్లయీస్గా డైరెక్టర్గా ముజమ్మిల్ఖాన్ బదిలీ ● ఏడాదిలో తనదైన ముద్ర వేసిన ముజమ్మిల్ఖాన్ ● అనుదీప్ ఉమ్మడి జిల్లాకు పరిచయస్తుడే...
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ను సివిల్ సప్లయీస్గా డైరెక్టర్గా బదిలీ చేయగా, ఆయన స్థానంలో హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న అనుదీప్ దురిశెట్టిని నియమించింది. గత ఏడాది జూన్ 16న విధుల్లో చేరిన ముజమ్మిల్ఖాన్ ఏడాది కాలం కూడా విధులు నిర్వర్తించకున్నా తక్కువ సమయంలోనే పాలనపై తనదైన ముద్ర వేశారు. కొత్త కలెక్టర్గా రానున్న అనుదీప్ 2017బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, ఆ బ్యాచ్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఆయన గతంలొ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ విధులు నిర్వర్తించారు.
జగిత్యాల జిల్లా వాసి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్కు చెందిన అనుదీప్ 1990 జూలై 6న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దురిశెట్టి మనోహర్ – జ్యోతి కాగా మెట్పల్లిలోని సూర్యోదయ హైస్కూల్లో పదో తరగతి వరకు, హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాక ఎంసెట్లో 45వ ర్యాంక్ సాధించి రాజస్థాన్లోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివారు. నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడే సివిల్స్కు సిద్ధమైన ఆయన రెండో ప్రయత్నంలో 2012లో 790వ ర్యాంక్ సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యాడు. ఐఆర్ఎస్గా శిక్షణ తీసుకుంటూనే మళ్లీ సిద్ధమయ్యాడు. కానీ 3, 4వ ప్రయత్నాల్లో ఫలితం కానరాకపోగా, ఐదో ప్రయత్నమైన 2017లో ఏకంగా సివిల్స్లో జాతీయ స్థాయి ఒకటో స్థానంలో నిలవడం విశేషం. శిక్షణ అనంతరం 2018లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ చేరిన అనుదీప్, అక్కడి కలెక్టర్ ఎం.వీ.రెడ్డి ఉద్యోగ విరమణతో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆతర్వాత 2023 జూలై 14న హైదరాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
ముజమ్మిల్ ఖాన్.. ఏడాది
ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా ఉన్న ముజమ్మిల్ ఖాన్ను ప్రభుత్వం సివిల్ సప్లయీస్ డైరెక్టర్గా బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్గా ఆయన గతేడాది జూన్ 16వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాక పాలనలో తనదైన మార్క్ చూపించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి వుయ్ కెన్ లెర్న్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్పై పట్టు సాధించేలా కృషి చేశారు. మహిళల అభ్యన్నతి కోసం సీ్త్ర శక్తి క్యాంటీన్లు ఏర్పాటుచేయించడమే కాక ఖమ్మంలో మహిళా మార్ట్ ఏర్పాటుచేయించారు. అలాగే, చింతకాని మండలంలో ఇసుక ర్యాంప్ నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించారు. అంతే కాక ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మా నించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్కు వచ్చే దివ్యాంగులకు ఉచిత భోజనం అమలుచేయిస్తున్నారు. ప్రభుత్వం పథకాల అమలు, ప్రజాపాలన సభలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూభారతి చట్టం సదస్సుల అమలులో సఫలీకృతులయ్యారు. జిల్లా ప్రజలు చైతన్యవంతులని, తన పదవీకాలంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు అందించిన సహకారం మరువలేనిదని ముజమ్మిల్ఖాన్ ‘సాక్షి’కి తెలిపారు.
సోమవారం విధుల్లోకి..
కలెక్టర్గా నియమితులైన అనుదీప్ దురిశెట్టి ఈనెల 16న(సోమవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా పనిచేసిన సమయాన పలుమార్లు ఖమ్మంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశాలకు ఆయన హాజరయ్యారు.