
తొలిరోజు వడివడిగా..
● ప్రారంభమైన కొత్త విద్యాసంవత్సరం ● ప్రభుత్వ స్కూళ్లలో 48శాతం హాజరు ● బడిబాటలో 3,387 మంది విద్యార్థుల చేరిక
ఖమ్మం సహకారనగర్: కొత్త విద్యాసంవత్సరం గురువారం మొదలైంది. తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు చేరుకోగా.. ఉపాధ్యాయులు మామిడి తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో స్వాగతం పలికారు. జిల్లాలో విద్యార్థులు లేక గత ఏడాది మూతబడిన పలు పాఠశాలల్లో నాలుగింటిని ఈసారి పునఃప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటిరోజే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలే కాక యూనిఫామ్ అందజేశారు. కాగా, రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్నగర్లో కొత్త పాఠశాలను కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ప్రారంభించారు.
హాజరు తక్కువే
విద్యాసంవత్సరం మొదటి రోజు పాఠశాలల్లో హాజరు తక్కువగానే నమోదైంది. జిల్లాలోని 1,214 ప్రభుత్వ పాఠశాలల్లో 54,225మంది విద్యార్థులకు గాను 26,033మంది హాజరయ్యారు. దీంతో హాజరు 48శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. అలాగే, ప్రభుత్వ వసతిగృహాలకు కూడా విద్యార్థులు అంతంతగానే వచ్చారు. సోమవారం నాటికి ఎక్కువ మంది వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇక 179మంది హెచ్ఎంలు హాజరు కాగా ఒకరు, స్కూల్ అసిస్టెంట స్థాయిలో 2,516మందికి గాను 23మంది సెలవులో ఉన్నారు. అలాగే, ఎస్జీటీలు 2,325మందికి గాను 25 మంది సెలవులో ఉండగా ముగ్గురు అనధికారికంగా గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
ప్రవేశాలు పెరుగుతాయి..
విద్యాసంవత్సరం తొలిరోజైన గురువారం విద్యార్థుల హాజరు 48శాతంగా నమోదైంది. బడిబాట ద్వారా ఈ ఏడాది 3,387మంది ప్రవేశాలు పొందారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరింత ప్రచారం చేస్తూ ప్రవేశాల పెంపునకు కృషి చేస్తాం.
– సామినేని సత్యనారాయణ, డీఈఓ
‘బడిబాట’తో ఫలితం
జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపునకు ఈనెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈమేరకు బుధవారం నాటికి 1వ తరగతిలో 1,222మంది, గురువారం 366మంది కలిపి 1,588మంది విద్యార్థులు చేరారు. అలాగే, రెండు నుంచి 10వ తరగతి వరకు 11వ తేదీకల్లా ప్రైవేట్ పాఠశాలల నుంచి 476 మంది, గురువారం 126మంది చేరారని అధికారులు తెలిపారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇంకో ప్రభుత్వ పాఠశాలలకు 1,197మంది రాగా, మొత్తం 3,387 ప్రవేశాలు నమోదయ్యాయని వెల్లడించారు.