
వారి నిర్ణయం స్ఫూర్తిదాయకం
ఇల్లెందురూరల్ : ఆ దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. తమ కుమార్తె ఉన్నతంగా చదువుకోవాలనే ఆకాంక్షతో గతేడాది ఖమ్మంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా బోధిస్తారనే విశ్వాసంతో ఈ ఏడాది రెండో తరగతిలో సర్కారు బడిలో చేర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మస్సివాగు గ్రామానికి చెందిన ఊకె కృష్ణ, రామేశ్వరి దంపతులు గుండాల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వారి కుమార్తె నమశ్విత ఖమ్మంలోని ప్రైవేట్ స్కూల్లో చదువుతుండగా ఈ ఏడాది బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇల్లెందు మండలంలోని ముత్తారపుకట్ట ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కార్పొరేట్ స్కూల్లో చదివించే ఆర్థిక స్థోమత ఉన్నా.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కృష్ణ – రామేశ్వరి తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ముత్తారపుకట్ట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కబ్బాకుల రవి హర్షం వ్యక్తం చేశారు.
కుమార్తెను ప్రభుత్వ స్కూల్లో చేర్పించిన ఉపాధ్యాయ దంపతులు