
రైతుల పేరుతో రుణాలు స్వాహా?
● ఏదులాపురం సొసైటీ చైర్మన్పై ఫిర్యాదుల వెల్లువ ● రుణానికి మించి బకాయి ఉందనే నోటీసులతో వెలుగులోకి.. ● విచారణకు ఆదేశించిన జిల్లా సహకార అధికారి
ఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) పరిధిలోని రైతులకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పి సగం మేర సొమ్మును చైర్మన్ కాజేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు రైతులు డీసీఓను ఆశ్రయించడంతో విచారణకు ఆదేశించారు. ఏదులాపురం పీఏసీఎస్ చైర్మన్ జర్పుల లక్ష్మణ్ నాయక్తోపాటు 51 మంది రైతులతో పీఏసీఎస్లో గురువారం సమావేశమైన సొసైటీల జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి.ఉషశ్రీ వివరాలు సేకరించారు. అయితే, ఈ అంశంతో తనకేం సంబంధం లేదని చైర్మన్ బదులివ్వడం గమనార్హం. రైతులు మాత్రం చైర్మన్ చెప్పడంతోనే సంతకాలు చేశామని.. కానీ తీసుకున్న రుణం కంటే ఎక్కువ చెల్లించాలని నోటీసులు వస్తున్నాయని వాపోయారు.
రూ.50 లక్షలకు పైగా రుణాలు..
ఏదులాపురం పీఏసీఎస్ పరిధిలోని గుండాలతండ, జాన్బాద్తండా, మద్దివారిగూడెం, గూడూరుపాడు తదితర గ్రామాలకు చెందిన 51మంది రైతులు చైర్మన్ లక్ష్మణ్ నాయక్ ప్రోత్సాహంతో 2023లో రూ.50లక్షలకు పైగా రుణాలు తీసుకున్నారు. వీరందరికీ రుణమాఫీ జరుగుతుందని చైర్మన్ నమ్మబలికినట్లు సమాచారం. కానీ ప్రభుత్వం గత ఏడాది రుణమాఫీ చేసినా ఎక్కువ మందికి కాలేదు. ఆపై సొసైటీ సిబ్బంది రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓ రైతు పేరిట రూ.లక్ష రుణం ఉందని చెప్పగా.. ఆయన మాత్రం రూ.50 వేలే తీసుకున్నానని బదులిచ్చాడు. అంతేకాక మరికొందరు రైతులకు ఇలాగే జరగడంతో వ్యవహారం బయటపడింది.
నిలదీసినా ఫలితం లేక..
రైతుల రుణాలు మాఫీ కాకపోవడం, తీసుకున్న రుణం కన్నా ఎక్కువగా బకాయి ఉండడంతో చైర్మన్ను నిలదీశారు. అయితే, ఆయన రెండు, మూడో విడతలో రుణమాఫీ అవుతుతుందని బదులిచ్చినట్లు సమాచారం. ఇంతలోనే రుణాలు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో నాలుగు రోజులుగా రైతులు డీసీఓ గంగాధర్కు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీఓ ఈ విషయాన్ని ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన లతో విచారణకు ఆదేశించారు. ఈమేరకు సొసైటీల జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి.ఉషశ్రీని విచారణ అధికారిగా నియమించగా, గురువారం ఆమె చైర్మన్ జర్పుల లక్ష్మణ్నాయక్, రైతుల సమక్షాన వివరాలు సేకరించారు.
విచారణ కొనసాగుతోంది..
చైర్మన్పై రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ మొదలుపెట్టాం. ఇరువర్గాలతో మాట్లాడగా తనకు సంబంధం లేదని చైర్మన్ చెప్పారు. శుక్రవారం కూడా ఈ అంశంపై విచారణ ఉంటుంది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాక నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.
– జి.ఉషశ్రీ, సొసైటీల జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్