
విపత్తులు ఎదుర్కోవడంపై శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: గతేడాది మాదిరి మున్నేటి ముంపు ఎదురైతే సహాయక చర్యల్లో పాల్గొనేలా ఖమ్మంలో పలువురిని ఆపదమిత్రలుగా నియమించారు. వీరికి ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఆర్.మాధిలేటి ఆధ్వర్యాన విపత్తులను ఎలా ఎదుర్కోవాలి, సహాయక చర్యలు చేపట్టడం, సీపీఆర్తో పాటు ప్రాథమిక చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
నేడు సాయినాథుడి నాణేల ప్రదర్శన
ఖమ్మంగాంధీచౌక్: షిర్డీ సాయినాథుడికి సంబంధించి తొమ్మిది నాణేలను ఖమ్మం గాంధీచౌక్లోని సాయి మందిరంలో గురువారం ప్రదర్శించనున్నట్లు చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. షిర్డీ సాయినాథుడు భగవంతుడిని చేరేందుకు తొమ్మిది నాణేలను రూపొందించి భక్తురాలైన లక్ష్మీబాయికి అందించినట్లు నమ్మిక. ఈ నాణేలను షిర్డీలోని లక్ష్మీబాయి సమాధి వద్ద ఉంచగా, ఆమె బంధువులు దేశ వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈమేరకు గురువారం ఖమ్మం చేరుకుంటారని వెంకటేశ్వరరావు తెలిపారు.
వేగంగా ఇందిరమ్మ
ఇళ్ల నిర్మాణం
కామేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు వేగంగా పూర్తిచేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. కామేపల్లి మండలంలోని గరిడేపల్లిలో ఇటీవల మృతి చెందిన బోడా బిబ్లి దశదినకర్మకు హాజరైన ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఈమేరకు త్వరగా పూర్తిచేసుకుంటే బిల్లులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, నాయకులు నల్లమోతు లక్ష్మయ్య, వెంకటనర్సయ్య, ధరావత్ రాంజీ, బానోత్ మత్రునాయక్, గుగులోత్ గోపి, రాములు తదితరులు పాల్గొన్నారు.