వైరా: జిల్లావ్యాప్తంగా రేషన్షాప్ల ద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా బియ్యం పంపిణీ జరుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. వైరా మున్సిపాలిటీ పరిధి సుందరయ్య నగర్లోని రేషన్ షాప్లో గురువారం ఆయన బియ్యం పంపిణీని పరిశీలించారు. ఈనెలాఖరు వరకు గడువు ఉన్నందున ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. డీలర్లు కూడా సమయపాలన పాటిస్తూ మూడు నెలల బియ్యం అందించాలని సూచించారు. సివిల్ సప్లయీస్ డీటీ వెంకటేశ్వరరావు, ఆర్ఐ కిరణ్తో పాటు వెంకటేశ్వరరావు, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రేపు జాతీయ లోక్అదాలత్
ఖమ్మంలీగల్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 14న ఆదివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. మొత్తంగా 13 బెంచ్లు ఏర్పాటు చేస్తుండగా.. రాజీపడదగిన అన్ని సివిల్, క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్, మోటారు ప్రమాదాలు, వివాహ సంబంధిత, బ్యాంక్ కేసులను పరిష్కరించుకోవచ్చునని వెల్లడించారు. పోలీస్, బీమా కంపెనీలు బాధ్యులతో చర్చించి రాజీపడదగిన కేసులను గుర్తించామని తెలిపారు. రాజీమార్గమే రాజమార్గంగా గుర్తించి డబ్బు, సమయాన్ని ఆదా చేసుకునేలా కక్షిదారులు లోక్అదాలత్ను వినియోగించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
రైతులకు సరిపడా
ఎరువులు
నేలకొండపల్లి: వానాకాలం పంటల సాగు చేసే రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని రామచంద్రాపురం, పైనంపల్లి, నాచేపల్లి, అప్పలనరసింహాపురంలో సొసైటీలు, మంగాపురం తండాలో ఎరువుల దుకాణాన్ని గురువారం తనిఖీ చేసిన ఆయన ఎరువుల స్టాక్ వివరాలపై ఆరా తీశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ జూన్ నెలకు కావా ల్సిన 25 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, వ్యాపారాలు కృత్రిమ కొరత సృష్టించకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, 6.61 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నందున డీలర్ల వద్ద కాకుండా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రైతులు విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి 6.10 లక్షల ఎకరాల్లో సాగవుతాయనే అంచనా ఉందని డీఏఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఏఓ ఎం.రాధ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్
అడ్మిషన్లు ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన 2025–26వ విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని డీఈఓ ఎస్.సత్యనారాయణ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. ఆగస్టు 31నాటికి 14ఏళ్లు నిండి, చదవడం, రాయడం రాని వారు పదో తరగతిలో, 15ఏళ్లు నిండి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్లో ప్రవేశాలకు అర్హులని వెల్లడించారు. పదో తరగతికి ప్రవేశానికి జనరల్ పురుషులు రూ. 1,550, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మైనార్టీలకు రూ.1,150, ఇంటర్మీడియట్కు జనరల్ పురుషులైతే రూ.1,800, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మైనార్టీలకు రూ.1,500 ఫీజు చెల్లించి జూలై 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, అపరాధ రుసుంతో జూలై 12నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు అవకాశం ఉంటుందని, వివరాలకు ఓపెన్ స్కూల్ సెంటర్లు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు 80084 03522 నంబర్లో సంప్రదించా లని సూచించారు. www. telanganaopenschool.org లేదా సమీపంలోని మీ సేవ, టీజీ ఆన్లైన్లో నమోదు చేసుకుని దరఖాస్తు ప్రింట్ కాపీలను స్టడీ సెంటర్లో సమర్పించాలని తెలిపారు.
అవాంతరాలు లేకుండా బియ్యం పంపిణీ