ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సత్కారం
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో విధులు నిర్వర్తిస్తూ శనివారం ఉద్యోగ విరమణ చేసిన అధికారులను రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం ఖమ్మంలో సన్మానించారు. భద్రాచలం డీఎంగా పనిచేసి, ప్రస్తుతం కార్గో ఏటీఎంగా విధులు నిర్వర్తిస్తున్న రామారావు, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) వీరన్న ఉద్యోగ విరమణ చేశారు. కార్యక్రమంలో ఖమ్మం డిపో మేనేజర్ దినేశ్కుమార్, పర్సనల్ ఆఫీసర్ రామకృష్ణ, ఏఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
రైతుల పేరిట
రుణం తీసుకున్న చైర్మన్
ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం సహకార సంఘం చైర్మన్ జర్పుల లక్ష్మణ్నాయక్ తమ పేరుపై సొసైటీలో రుణం తీసుకుని చెల్లించలేదని తనగంపాడుకు చెందిన తేజావత్ బాలు, వీరన్న ఆరోపించారు. పట్టాదారు పాస్ బుక్లు పెట్టి రుణం తీసుకోగా, తిరిగి చెల్లించాలని కోరితే రుణమాఫీ అవుతుందని నమ్మబలికాడని పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ కాకపోగా ప్రస్తుతం అప్పు చెల్లించాలని తమకు నోటీసులు వచ్చాయని వాపోయారు. ఈ మేరకు చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వారు జిల్లా సహకార శాఖ అధికారి, ఖమ్మం రూరల్ సీఐకి ఫిర్యాదు చేశారు.
విద్యుత్ వేసవి ప్రణాళిక విజయవంతం
ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి
ఖమ్మంవ్యవసాయం: వేసవి కాలానికి రూపొందించిన విద్యుత్ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. నవంబర్లోనే కార్యాచరణ సిద్ధం చేసి.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంతో వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగామని వెల్లడించారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న కొత్తలింగాల, మమతా రోడ్డు, తనికెళ్ల, బత్తులపల్లి, మిట్టపల్లి, జన్నారం, ములుగుమాడు, సత్తుపల్లి సబ్స్టేషన్లలో మొత్తం 13 పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, ఇల్లెందు క్రాస్, టేకులపల్లి, దానవాయిగూడెం, ప్రకాశ్నగర్, ధంసలాపురం, ఖానాపురం, బుర్హాన్పురం, వైరా, ఎర్రుపాలెం, లక్ష్మీపురం, జిల్లా ఆస్పత్రి, మర్లకుంట ప్రాంతాల్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే కాక అవసరమైన చోట 295 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. తద్వారా ఓవర్ లోడ్ తగ్గిందని తెలిపారు. కాగా, 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ ఏర్పాటుతో సమస్య ఎదురైన సబ్స్టేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ సరఫరా చేయగలిగామని ఎస్ఈ వెల్లడించారు. ఇప్పటివరకు 213.14 కి.మీ. మేర 36 సబ్స్టేషన్లకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.
మత్స్యకార మహిళలకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల మహిళా మత్స్యకారులకు చేపలు, రొయ్యలతో ఆహార ఉత్పత్తుల తయారీపై ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశాక నర్సాపురం మత్స్య కళాశాల అసిసియేట్ డీన్ నీరజ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో మత్స్య రంగ అభివృద్ధికి అనువైన అవకాశాలు ఉన్నందున మహిళలు చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని సూచించారు. నైపుణ్యాలు పెంచుకుని యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చని తెలిపారు. చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, ఇతర ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా కొనసాగించాలని పేర్కొన్నారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఇప్పటి వరకు 4 వేల మంది మత్స్యకారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రవీందర్, నాగరాజు, భార్గవి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సత్కారం
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సత్కారం


