మధిర: కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కోరారు. మధిర బంజారా కాలనీ శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఆదివారం మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఏకపాత్రాభినయం, పౌరాణిక నాటికల సన్నివేశ పోటీల్లో వారు మాట్లాడారు. మధిర ప్రాంతానికి చెందిన పలువురు కళాకారులు జాతీయస్థాయిలో అవార్డులు సాధించి మధిరకు దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చారని అన్నారు. అలాంటి కళాకారులను ఆదుకోవాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముందుగా బళ్లారి రాఘవ కళాపరిషత్ అధ్యక్షుడు బొబ్బిళ్లపాటి శ్రీకృష్ణ సాయి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు మల్లాది హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.