
మార్కెట్లో సౌర వెలుగులు..
● ఖమ్మం వీడీవోస్ కాలనీ సమీకృత మార్కెట్లో ఏర్పాటుకు ప్రతిపాదన ● 15 కిలోవాట్ల ప్యానళ్లకు రూ.10 లక్షలతో అంచనా ● సౌర విద్యుత్తో నిర్వహణ భారం తగ్గే అవకాశం
ఖమ్మంవ్యవసాయం: సౌర విద్యుత్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా గృహాలకు ఉచిత విద్యుత్ అందించటం లక్ష్యంగా సబ్సిడీలతో ప్రోత్సహిస్తోంది. రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరగటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గమైన సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నాయి. అవకాశం ఉన్నచోట సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు, సమీకృత మార్కె ట్లు, రైతు బజార్లలో కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సూ చనలతో ఖమ్మంలోని వీడీవోస్ కాలనీ, బస్టాండ్ పక్కన ఉన్న సమీకృత రైతు బజార్లు, పాత బస్టాండ్ సమీపంలో ఉన్న రైతుబజార్లను మార్కెటింగ్ శాఖ, రెడ్–కో అధికారులు సందర్శించారు. ఈ మూడింటిలో వీడీవోస్ కాలనీలో ఉన్న సమీకృత రైతు మార్కెట్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నట్లు రెడ్–కో అధికారులు గుర్తించారు.
ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు
వీడీవోస్ కాలనీ సమీకృత రైతు మార్కెట్ భవనంపై సౌర విద్యుత్ ఫలకాల నిర్మాణానికి అవకాశం ఉన్న ట్లు రెడ్–కో అధికారులు గుర్తించారు. ఈ భవనంపై 15 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర ఫలకాల ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. 15 కిలోవాట్ల సౌర ఫలకాల నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి, రెడ్–కో అధికారులు, జిల్లా మార్కెటింగ్ శాఖ ద్వారా ఉన్నతాధికారులకు పంపించనున్నారు. అయితే సమీకృత మార్కెట్లను మున్సిపాలిటీ నిర్మించగా, నిర్వహణను మార్కెటింగ్ శాఖ చూస్తోంది. దీంతో సౌర విద్యుత్కు ప్రభు త్వం నుంచి అనుమతులు వస్తే నిధులను ఏ శాఖ భరిస్తుందనేది తేల్చాల్సి ఉంటుంది.
తగ్గనున్న నిర్వహణ భారం
సౌరవిద్యుత్ ఉత్పత్తితో సమీకృత మార్కెట్ నిర్వ హణ భారానికి కొంత వెసులుబాటు కలిగే అవకా శం ఉంది. ఇప్పటికే వినియోగదారుల ఆదరణకు నోచుకోకుండా అంతంతమాత్రంగా నిర్వహణ సాగిస్తున్నాయి. విద్యుత్ భారం అదనం. ఇప్పటికే మూతపడి ఉన్న నాన్వెజ్ మార్కెట్లో సేంద్రియ రైతు మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత కూరగాయలు, ఆకుకూరల విక్రయాలతో పాటు సేంద్రియ రైతు మార్కెట్ నిర్వహణలోకి వస్తే సౌర విద్యుత్ ఉత్పత్తి కొంత మేరకు తోడ్పాటునిచ్చే అవకాశం ఉంది. ఈ మార్కెట్కు విద్యుత్ బిల్లుల భారం తగ్గే అవకాశం ఉంది.
అనుమతులు రాగానే పనులు
ప్రభుత్వం అనుమతులు ఇస్తే వీడీవోస్ కాలనీ సమీకృత రైతు మార్కెట్ భవనంపై సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం. ఈ భవనంపై 15 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఫలకాలను అమర్చే అవకాశం ఉంది. ఈ మార్కెట్ భవనంపై సౌర విద్యుత్ ఉత్పత్తికి వనరులు కూడా అనుకూలంగా ఉన్నాయి.
–పి.అజయ్కుమార్, మేనేజర్, రెడ్–కో,
ఉమ్మడి ఖమ్మం జిల్లా

మార్కెట్లో సౌర వెలుగులు..

మార్కెట్లో సౌర వెలుగులు..