
ఆ పదవులు అధికారికం!
నామినేటెడ్ పదవులపై జీఓ విడుదల
● కార్పొరేషన్ చైర్మన్లుగా ఉమ్మడి జిల్లాలో ఐదుగురికి అవకాశం ● గతంలోనే ప్రకటించినా జీఓ విడుదలలో ఆలస్యం ● ఎన్నికల కోడ్ ముగియడంతో ఇన్నాళ్లకు లైన్క్లియర్ ● పదవుల కోసం ఇంకొందరు నేతల యత్నాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఐదుగురు నేతలను కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. అయితే అప్పట్లో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అధికారికంగా జీఓ విడుదల కాలేదు. ప్రస్తుతం కోడ్ ముగియడంతో రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్బాబు, పొదెం వీరయ్య, నాయుడు సత్యనారాయణ, నూతి శ్రీకాంత్కు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయిస్తూ ఈ ఏడాది మార్చి 15 తేదీతో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ పదవుల్లో వీరు రెండేళ్ల పాటు కొనసాగనుండగా.. మరిన్ని పదవులు భర్తీ అవుతాయన్న ప్రచారంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
జిల్లాకు ప్రాధాన్యత
దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమకు తగిన గుర్తింపు దక్కాలని నాయకులు, కార్యకర్తలు ఆశించారు. అధికార పగ్గాలు చేపట్టాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో ఉన్న పలు కమిటీలను రద్దు చేయగా.. కాంగ్రెస్ నేతలకు వీటిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. దీంతో రాష్ట్రస్థాయిలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్స్వీప్ చేయడం, ముగ్గురు మంత్రులు ఉండడంతో తొలివిడతలోనే ఐదుగురికి పదవులు కేటాయించడం ద్వారా ప్రాధాన్యత కల్పించారు.
ఐదుగురికి పదవులు
లోక్సభ ఎన్నికలకు ముందుగానే ఉమ్మడి జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్బాబు, పొదెం వీరయ్య, నాయుడు సత్యనారాయణ, నూతి శ్రీకాంత్కు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ పదవులు దక్కాయి. వీరిలో రాయల నాగేశ్వరావు పాలేరు అసెంబ్లీ టికెట్ను ఆశించి భంగపడగా.. మువ్వా విజయ్బాబు సైతం అసెంబ్లీ టికెట్ను ఆశించారు. ఇక భద్రాచలం నుంచి పొదెం వీరయ్య కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరితో పాటు పార్టీ నాయకులు నాయుడు సత్యనారాయణ, నూతి శ్రీకాంత్కు పదవులు ఇచ్చారు. ఇందులో రాయల నాగేశ్వరరావును తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా, పొదెం వీరయ్యను తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మగా, మువ్వా విజయ్బాబు ను తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, నాయుడు సత్యనారా యణను తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మగా, నూతి శ్రీకాంత్ను తెలంగాణ స్టేట్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు మార్చి 15వ తేదీతో విడుదల కాగా, బాధ్యతల స్వీకరణకు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఇందులో రాయల నాగేశ్వరరావు మాత్రం ఈనెల 11న బాధ్యతలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది.
ఇంకా పోటీలో ఎవరెవరు?
సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్కుమార్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా నియోజకవర్గం నుంచి బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు రాష్ట్రస్థాయి పదవుల కోసం తమ నేతలను కలుస్తున్నారు. ఇంకా భద్రాచలం నియోజకవర్గానికి చెందిన బుడగం శ్రీనివాస్, మధిర నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మందడపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, డాక్టర్ కోట రాంబాబు, ఐలూరు వెంకటేశ్వరరెడ్డి, పైడిపల్లి కిషోర్ పదవులు ఆశిస్తున్నారు. అలాగే, ఖమ్మం నియోజకవర్గం నుంచి జావేద్, కమర్తపు మురళి, సాధు రమేష్రెడ్డి, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, పినపాక నియోజకవర్గంలో తుళ్లూరి బ్రహ్మయ్య, బట్టా విజయ్, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, ఎడవల్లి కృష్ణ, ఇల్లెందు నియోజకవర్గంలో డాక్టర్ జి.రవి, మేకల మల్లిబాబుయాదవ్ నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారి జాబితాలో ఉన్నారు. దీంతో వీరిలో ఇంకా ఎవరెవరికి పదవులు దక్కుతాయనే ఆసక్తి నెలకొంది.
స్పీడ్ పెంచిన ఆశావహులు
గతంలోనే భర్తీ చేసిన పదవులకు సంబంధించి ఉత్తర్వులు విడుదల కావడంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ఇంకొందరు ఉమ్మడి జిల్లా నేతలు తమ ప్రయత్నాల్లో వేగం పెంచారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఇతర నేతల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆ పదవులు అధికారికం!

ఆ పదవులు అధికారికం!