రాయచూరు రూరల్: సినీ నటుడు దివంగత డాక్టర్ రాజ్కుమార్ 19వ వర్ధంతిని సోమవారం నగరంలో నిర్వహించారు. డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ట్రస్టు కార్యాలయంలో డాక్టర్ రాజ్కుమార్ చిత్రపటానికి ట్రస్టు అధ్యక్షుడు సాదిక్ ఖాన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. సభ్యులు బసవరాజ్, సంతోష్, చేతన సంస్థ సంచాలకుడు సబ్జలీ, నాసిర్లున్నారు.
సహాయవాణిలో
772 కేసులకు పరిష్కారం
రాయచూరు రూరల్ : జిల్లాలో ఈ ఏడాది సహాయవాణి ద్వారా 790 కేసులు నమోదు కాగా 772 కేసుల సమస్యలను పరిష్కరించినట్లు జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ వెల్లడించారు. సోమవారం కార్యాలయంలో తనను కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 28 శాఖలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 14 రోజుల్లో 20 కేసులు రావడంతో నీటి ఎద్దడి పరిస్థితిపై నిఘా ఉంచి పరిష్కరించామని, ప్రజలు 08532– 230 539 సహాయవాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
రిజర్వేషన్లు అమలు చేయాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అదనపు రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. సోమవారం లోక్సభ సభ్యుడి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. 17 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ముందు జనాభాకు అనుగుణంగా కేటాయించిన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలను గమనించి ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం అదనపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో పద్మ, నరసన్న నాయక్, శరణ బసవ, వరలక్ష్మి, దేవేంద్ర గౌడ, గిరియప్పలున్నారు.
భూ సర్వేకు ఆటంకం.. 12 మంది అరెస్ట్
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా బిచ్చాలి గ్రామంలో వెలసిన మంత్రాలయం జపకట్టి ప్రాంతంలోని భూ సర్వేకు అడ్డు పడిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత మంది రైతులు ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటున్న అంశంపై కోర్టు మెట్లెక్కారు. అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్వర్మ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేస్తుండగా అడ్డుకోవడంతో వారిని యరగేర పోలీసులు అరెస్ట్ చేశారు.
పిల్లలకు వైదిక ధర్మ సందేశాలు నేర్పాలి
రాయచూరు రూరల్: దేశంలో హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్యమని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందరింలో కర్ణాటక కళా మండలి, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నుపుర సంభ్రమ–22వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి భరతనాట్యంపై ఆసక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో జయలక్ష్మి మంగళ మూర్తి, ముకుందాచారి జోషి, ప్రదీప్ భట్, రమాదేవి, సంజయ్ కుమార్, సీతాబాయి, రంగనాథ్, కర్ణాటక కళా మండలి సభ్యులు లక్ష్మి, నాగేంద్ర, కన్నడ సంస్కృతి శాఖ అధికారి ఉత్తరాదేవి మఠపతిలున్నారు.


