బళ్లారి రూరల్: ప్రతి 2 వేల మంది పిల్లల్లో ఒక్కరికి పెదవి చీలిక వచ్చే అవకాశం ఉందని బళ్లారి లయన్స్ క్లబ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ లయన్ ఎస్.కె.అజయ్ తెలిపారు. బళ్లారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత పెదవి చీలిక పరీక్షలు, శస్త్రచికిత్సల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదవి చీలిక వంశపారంపర్యంగా పిల్లలకు పుట్టుకతోనే వచ్చే ఒక వ్యాధి అని పేర్కొన్నారు. ఇందువల్ల చిన్నారులు తల్లిపాలు తాగడానికి ఇబ్బంది పడతారన్నారు. పోతపాలు వల్ల పిల్లలు వివిధ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పెదవి చీలిక వల్ల దంత సమస్యలు, ఇన్ఫెక్షన్స్ తరచూ వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే పెదవి చీలికకు శస్త్రచికిత్స చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. బళ్లారి లయన్స్క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశలోని గుంతకల్లు ,రాయదుర్గం, నేమకల్లు, బొమ్మనహాళ్, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 35 మంది పెదవి చీలిక పిల్లలను వైద్యం వారి తల్లిదండ్రులు తీసుకొచ్చారన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 15 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఈనెల 15వ తేదీన బెల్గాంకు పంపుతామని వెల్లడించారు. శస్త్రచికిత్సలు, రవాణా, వసతి సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ సభ్యులు డాక్టర్ గడ్డి దివాకర్, బెల్గాంకు చెందిన డాక్టర్ అపూర్వ, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.


