హొసపేటె: గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, పరిశుభ్రతను కమిటీ సభ్యులు ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని పీడీఓ నారాయణప్ప తెలిపారు. తాలూకాలోని పూజారహళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామీణ తాగునీరు, పారిశుధ్య హొసేపేట విభాగం ఆధ్వర్యంలో గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నీటి వనరుల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, నీటి గంట (నీటి పంపిణీదారు) వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులతో కలిపి 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ నీరు, పారిశుధ్య శాఖ జిల్లా స్థాయి అధికారి మహంతేష్ మాట్లాడుతూ.. తుంగభద్ర నది నుంచి నీటిని సరాఫరా చేసే బహుళ– గ్రామ తాగునీరు పథకం కూడా ఇందులో భాగంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవన్ మిషన్ సరఫరా పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతోందన్నారు. గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ తమ గ్రామంలోని తాగునీరు, పరిశుభ్రతపై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించని వారితో మాట్లాడాలన్నారు. మరుగుదొడ్లను తప్పక ఉపయోగించుకునేలా సూచించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిల్ కలెక్టర్ పాలయ్య, కంప్యూటర ఆపరేటర్ అర్పిత, భవాని, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సమితి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


