శివాజీనగర: చాలాకాలంగా ఎదురు చూస్తున్న బెంగళూరు– ముంబై నగరాల మధ్య సూపర్ఫాస్ట్ వందే భారత్ స్లీపర్ రైలు సంచారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ముంబైకి వందే భారత్ స్లీపర్ రైలు కావాలని బెంగళూరు ఎంపీలు కోరుతున్నారు. రెండు నగరాల మధ్య సుమారు 976 కిలోమీటర్ల దూరం ఉంది. రైలు ప్రయాణం 24 నుంచి 30 గంటలు పడుతుంది. బస్సులో అయితే 16 నుంచి 18 గంటల్లో అయిపోతుంది. వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పటినుంచి మొదలయ్యేది త్వరలో ప్రకటిస్తారు. రాష్ట్రంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు కానుంది. కర్ణాటకలో సుమారు 22 వందే భారత్ రైళ్లు సంచరిస్తున్నాయి. బెంగళూరు నుంచి చైన్నె, హైదరాబాద్, మంగళూరుకు వెళ్తున్నాయి.
తల్లీ, కూతురి అదృశ్యం
మండ్య: బంధువుల ఇంటికి వెళుతున్నా అని చెప్పి వెళ్లిన తల్లీకూతురు తిరిగి రాలేదు. వివరాలు.. శ్రీరంగ పట్టణ వద్ద హెబ్బాడిహుండికి చెందిన ముజాహిద్ భార్య రూహిల (25), ఆమె కుమార్తె మన్నత్ (4)ను తీసుకుని 7న ఉదయం మైసూరులోని బంధువుల ఇంటికి వెళుతున్నట్లు చెప్పి వెళ్లింది. అయితే బంధువుల ఇంటికి చేరుకోలేదు, మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. భర్త పలుచోట్ల గాలించినా జాడ లేరు. ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది, దీంతో శ్రీరంగపట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
చెరువులో నంది విగ్రహం లభ్యం
దొడ్డబళ్లాపురం: చెరువులో పూడికతీత తవ్వకాలు జరుపుతుండగా పురాతన కాలం నాటి నంది విగ్రహం బయటడింది. హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా దూదిహళ్లిలో ఈ సంఘటన జరిగింది. కూలీలు మట్టిని తవ్వుతుండగా 3 అడుగుల ఎత్తుగల బసవన్న రాతి విగ్రహం బయటపడడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. నందిని చూడాలని చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలివచ్చారు. విగ్రహాన్ని గ్రామంలోని దేవాలయం వద్ద ప్రతిష్టించాలని గ్రామస్తులు తీర్మానించారు.


