సాక్షి, బళ్లారి: బళ్లారి నగర నడిబొడ్డున నిత్యం వేలాది మంది జనం, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డుకు ఇరువైపులా పాదచారులు వెళ్లేందుకు ఐరన్ పైపులు, చైనులు వేసి కట్టుదిట్టం చేశారు. ఈ పనులు చేపట్టేందుకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికి, ఆ పనుల్లో నాణ్యత లోపిస్తోంది. పని పూర్తి చేసిన తర్వాత కనీసం రెండు, మూడు సంవత్సరాలు గడవక ముందే అధ్వానంగా మారుతున్నాయి. ఇనుప కడ్డీలు, చైనులు రోడ్డుపై పడిపోవడంతో పాదచారులతో పాటు, వాహనాల్లో వెళ్లే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు నాణ్యతగా పనులు చేయకపోవడంతో పనులు ప్రారంభించిన ఆరు నెలలకే ఊడిపోతున్నట్లు సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి మండిపడ్డారు. సంబంధిత అధికారులు, పాలకులు చొరవ తీసుకుని పడిపోయిన పైపులను, చైనుకు మరమ్మతులు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు.
అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డులో పాదచారులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన
ఇనుప కడ్డీలు, చైన్ ఊడిపోయిన దృశ్యం


