కోలారు: ముళబాగిలు నుంచి తాలూకాలోని ఆవణి గ్రామానికి ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీస్ను ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ మార్గంలో కొత్త సర్వీసును ప్రారంభించాలని ప్రజలు కోరారన్నారు. దీంతో అధికారులతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. తాలూకాలో గంజాయి, క్రికెట్ బెట్టింగ్ను పూర్తిగా అరికట్టాలని పోలీసులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆవణి గ్రామస్తులు రఘుపతి రెడ్డి, సత్యణ్ణ, గొల్లహళ్లి జగదీష్, అన్వర్ పాషా పాల్గొన్నారు.
కమనీయం..
సీతారామ కల్యాణం
శ్రీనివాసపురం: తాలూకాలోని రాయల్పాడు ఫిర్కా పెద్దూరు గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ కల్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి అభిషేకాలు, అలంకరణలు, విశేష పూజలు, హోమ, హవనాలనునిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్ఛరణ మధ్య సీతారాముల ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను గ్రామంలో ఘనంగా ఊరేగించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.


