రాయచూరు రూరల్: నారాయణపుర కాలువ చివరి ఆయకట్టు భూములకు నీరందించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాలువకు మార్చి 31 వరకు నీరు అందించడంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు కాలువలకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాలకు నీరు అందించే దిశలో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. డ్యాంలో ప్రస్తుతం 56.132 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఔట్ ఫ్లో 11,396 క్యూసెక్కుల నీటికి బదులు కాలువలకు రోజు 3,800 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతున్నాయి. జనవరి మొదటి వారంలో రెండవ పంటను సాగు చేశారు. ఏప్రిల్ నెలలో లక్ష హెక్టార్లలో వరి కోతకు వస్తోంది. వరి పంటకు ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేస్తే పంట చేతికి దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు.
శాశ్వత పరిష్కారానికి చర్యలు
చేపట్టని వైనం
సర్కార్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న అధికారులు


