హొసపేటె: గంగావతి తాలూకాలోని శ్రీరామ నగర్ సమీపంలో ఉన్న శివరామకృష్ణ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం వరి బస్తాల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సుమారు 15 టన్నుల వరి బస్తాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కంప్లి తాలూకా నుంచి కారటగి రైస్ మిల్లుకు ఒక ట్రాక్టర్లో 15 టన్నుల వరి బస్తాలను తరలిస్తుండగా, శ్రీరామనగర్ సమీపంలోని గంగావతి–రాయచూరు జిల్లా రహదారిపై ఉన్న శివరామకృష్ణ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ట్రాక్టర్ ట్రాలీకి ఉన్న అనుసంధాన లింక్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వరి బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగి రెండు గంటలు గడిచినా కూడా సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది గాని, వైద్య సహాయ వాహనం గానీ సంఘటన స్థలానికి చేరుకోలేదు. ట్రాక్టర్ డ్రైవర్ విశ్వనాథ్ (32) ముఖం, చేతులు, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామీణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
డ్రైవర్కు తీవ్ర గాయాలు
2 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్


