హుబ్లీ: వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. గదగ్ జిల్లా హుయిలగోళ గ్రామానికి చెందిన యువకుడు చంద్రు కురి అదృశ్యం కాగా.. ఆ తర్వాత కాలిపోయిన స్థితిలో అతడి మృతదేహం లభ్యమైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు దర్యాప్తులో తేలింది. కేసుకు సంబంధించి మృతుడి ప్రేయసి రత్న, ఆమె భర్త ఈరప్ప, సోదరుడు మహంతేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. హుయిలగోళ గ్రామానికి చెందిన చంద్రు కురి, అదే గ్రామానికి చెందిన రత్న కుదరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. రత్నకు శిరహట్టి తాలూకా వళలాపుర ఈరప్పతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రత్న పదే పదే పుట్టింటికి వచ్చి చంద్రుతో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం భర్త ఈరప్ప, అతడి సోదరుడు మహంతేష్కు తెలియడంతో మందలించారు. అయినా రత్న, ఆమె ప్రియుడు చంద్రు కురి వివాహేతర సంబంధం కొనసాగించారు. దీంతో చంద్రు కురిని ఎలాగైనా అంతం చేయాలని రత్న భర్త ఈరప్ప, సోదరుడు మహంతేష్ ప్లాన్ వేశారు. మార్చి 25 అర్ధరాత్రి రత్నతో చంద్రుకు ఫోన్ చేయించి ఇంటికి పిలుపించుకున్నారు. చంద్రు ఇంటికి రాగా అంతకు ముందే ఆ ఇంట్లోని మరుగుదొడ్డిలో దాకున్న ఈరప్ప, మహంతేష్ దాడి చేశాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతమైన బ్రిడ్జి వద్ద తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు చంద్రు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన అనంతరం అక్కడి నుంచి పరారీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


