హొసపేటె: వినియోగదారులు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు ఆ ఉత్పత్తి పరిమాణం, నాణ్యతను నిర్ధారించుకోవాలని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ హాలులో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి వినియోగదారుడు తాను కొనుగోలు చేసే వస్తువు నాణ్యత, బరువు గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. వినియోగదారులు వివిధ మాధ్యమాల్లో ప్రసారమయ్యే ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోరాదన్నారు. అందుకు బదులుగా ఉత్పత్తి నాణ్యత, భద్రతను తనిఖీ చేసి కొనుగోలు చేయాలన్నారు. ఏదైనా వస్తువు లేదా ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు వారు ఎల్లప్పుడూ అధికారిక బిల్లు లేదా రసీదును పొందాలన్నారు. ఉత్పత్తి, కొనుగోలులో లోపం ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. వ్యాపారులు తప్పనిసరిగా స్టాంప్ వేసిన ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలను ఉపయోగించాలన్నారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ ఎన్.తిప్పేస్వామి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సీనియర్ న్యాయవాది కరుణానిధి, ఆహార పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్, లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ మనోజ్కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుజ్జల నాగరాజ్, కార్యదర్శి కృష్ణదేవరాయలు, వివిధ శాఖల అధికారులు, వినియోగదారులు హాజరయ్యారు.


