హొసపేటె: మహిళా ఉద్యోగులు ఆఫీసు పని హడావిడిలో వారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగులు మాత్రమే ప్రజలకు మంచి సేవలు అందించగలరని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అభిప్రాయపడ్డారు. నగరంలో సోమవారం రోటరీ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. మహిళ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటానికి కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, శారీరక అనారోగ్యాల కంటే పని ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి ఎక్కువ హానికరం అని సలహా ఇచ్చారు. అందువల్ల ప్రతి మహిళా ఉద్యోగి రోజుకు కనీసం అరగంట యోగా, ధ్యానం కోసం కేటాయించాలి. ఇది రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. హొసపేటె ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు నైమిష, కార్యదర్శి డాక్టర్ ఆర్తి రాజ్పూత్, ఆయుష్ శాఖ వైద్య అధికారి డాక్టర్ మునివాసుదేవ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.


