బనశంకరి: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడింది. అనేక చిన్నా చితకా హోటళ్లు మూతపడ్డాయి. ప్రత్యేకించి మాంసాహార హోటల్స్, రెస్టారెంట్లు మూసివేసే పరిస్థితి తలెత్తింది. బెంగళూరులో ప్రముఖ ఎంపైర్ హోటల్తో పాటు అనేక రెస్టారెంట్లలో వంటకాలను బాగా తగ్గించారు. గ్యాస్ ఎక్కువగా వాడే గ్రిల్డ్ చికెన్, మటన్ వంటకాలు , షేర్వాను బంద్ చేశారు. మెజస్టిక్ తో పాటు నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో ఉండే మాంసాహార హోటల్స్ మూతపడడంతో కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. అన్నం సాంబార్ వంటి తేలికపాటి వంటకాలే హోటళ్లలో లభిస్తున్నాయి. అవి కూడా ధరలు పెరిగాయి. ఉత్తర భారత వంటకాలు, చైనీస్ రుచులకు బ్రేక్పడింది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా
గ్యాస్ కొరతతో ధార్వాడతో పాటు అనేక జిల్లాల్లో హోటల్ యజమానులు కట్టెలు పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. కానీ ఫాస్ట్ఫుడ్కు కట్టెల పొయ్యిలు సరిపోవు, దీంతో ఆ సెంటర్లు చాలావరకు మూసేశారు. బెంగళూరు హోటల్స్ అసిసోయేషన్ అద్యక్షుడు పీసీ.రావ్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బాయలర్లు, ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని సలహా ఇచ్చారు.
బెంగళూరు హోటళ్లకు సిలిండర్ల కొరత
అనేక ఆహారశాలల బంద్
బ్లాక్లో భారీ రేట్లు
స్టాక్ లేని కారణంగా బ్లాక్ మార్కెట్లో వాణిజ్య సిలిండర్లకు ఎక్కడ లేని గిరాకీ నెలకొంది. కొందరు అక్రమార్కులు, సిలిండర్ ఫిల్లింగ్ వ్యాపారులు ఒక్కో సిలిండర్ను రూ.3 వేల నుంచి రూ.5 వేల మధ్య అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొడగు, చిక్కమగళూరు లాంటి పర్యాటక ప్రాంతాల్లో హోటల్స్ బంద్ కావడంతో పర్యాటకులు ఆకలితో ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా గ్యాస్ను పంపిణీ చేయాలని హోటళ్ల యజమానులు కోరుతున్నారు.


