పూతలపట్టు (యాదమరి): తిరుమల యాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెంకన్న దర్శనం కోసం ఇంటి నుంచి ఉత్సాహంగా కారులో బయలుదేరగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మరో రెండు గంటల్లో తిరుమలకు చేరుకోనుండగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెలుతున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు సహా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పి. కొత్తకోటలో చోటు చేసుకుంది.
ఎలా జరిగిందంటే..
పూతలపట్టు పోలీసుల వివరాలు మేరకు.. కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన సతీష్ (50) తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు. తెల్లవారుజామున పూతలపట్టు మండల పరిధి పి.కొత్తకోట సమీపంలో కారు నడుపుతున్న సతీష్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ముందు వెలుతున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలో కూర్చున్న సతీష్, ఆయన భార్య భాగ్యలక్ష్మి (45) అక్కడే మరణించారు. శశాంక్, పావని, మహాలక్ష్మి, తుషారకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో సమీప పి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంబులెన్సులో క్షతగాత్రుల తరలింపు
తిరుమలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
ఇద్దరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దుర్ఘటన


