సాక్షి,బళ్లారి: బళ్లారి ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారం కోసం శ్రమించాలని రైల్వే కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో లోక్సభ సభ్యుడు తుకారాంకు విజ్ఞప్తి చేశారు. శనివారం సమితి అధ్యక్షుడు మహేశ్వరస్వామి నేతృత్వంలో పలువురు సభ్యులు లోక్సభ సభ్యుడిని కలిసి బళ్లారి ప్రాంత రైల్వే సమస్యలను వివరించారు. ప్రాంతీయ రైల్వే అభివృద్ధి, కొత్త మార్గాలు, నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించాలని తదితర అంశాలతో కూడిన డిమాండ్లను వివరించారు. ముఖ్యంగా ఆగిపోయిన కొల్హాపూర్– మణుగూరు రైలు సేవలు త్వరలో తిరిగి ప్రారంభించాలని, శివమొగ్గ–చైన్నె రైలు సేవలను పునరుద్ధరించాలన్నారు. బళ్లారి మీదుగా వందే భారత్ లేదా ఇంటర్ సిటీ రైలును నడపాలన్నారు. దీనివల్ల బళ్లారితో పాటు చట్టుపక్కల జిల్లాలకు చెందిన వారికి మెరుగైన సేవలు అందుతాయన్నారు.
బళ్లారి మీదుగానే అజ్మీర్ రైలు నడపాలి
మైసూరు– అజ్మీర్ రైలును బళ్లారి, హొసపేటె మార్గంలోనే నడపాలన్నారు. ఈ మార్గం ద్వారా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న బళ్లారి– సిరుగుప్ప– సింధనూరు మధ్య రైలు మార్గాన్ని నిర్మించాలని, హగరి– ఆదోని రైలు మార్గాన్ని త్వరితగతిన ప్రారంభించాలని, ఈ ప్రాజెక్టులను అమలు చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ విషయాలపై అవసరమైతే పార్లమెంటులో కూడా గళం విప్పాలని మనవి చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సమితి సభ్యులు పల్లెద ప్రభులింగ, బండేగౌడ, ఉమాపతి, బీ.ఎం.ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ తుకారాంకు రైల్వే కార్యాచరణ సమితి సభ్యుల వినతి


