దొడ్డబళ్లాపురం: బీఎంటీసీ బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయిన రూ.10 లక్షల విలువైన బంగారు నగలను సిబ్బంది తిరిగి ఆమెకు అప్పగించారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ తన బ్యాగ్ను బస్సులో మర్చిపోయింది. కండక్టర్ నాగేంద్ర, డ్రైవర్ సిద్ధరాజు బ్యాగ్ తీసుకుని చూడగా బంగారు నగలు కనిపించాయి. డిపో మేనేజర్కి తెలిపారు. బ్యాగ్లో ప్రయాణికురాలి వివరాలు ఉండడంతో ఆమెను సంప్రదించి డిపోకి పిలిపించి బ్యాగ్ను అందజేశారు. నగలు పోయాయని తీవ్ర బాధలో ఉన్న ఆమెకు ఉపశమనం కలిగింది. డ్రైవర్, కండక్టర్ నిజాయితీని మహిళతో పాటు తోటి ఉద్యోగులు అభినందించారు.
అవి పాత వీడియోలు
● సీఐ కేసులో కమిషనర్ వివరణ
శివాజీనగర: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ సందేశ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి బెదిరించిన కేసు గురించి మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డి స్పష్టీకరణను ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ప్రవర్తనలో లోపాలు ఉన్నది వాస్తమే అయినా, ఆయన విరుద్ధంగా కొన్ని ఫిర్యాదులు ముందుగానే ప్లాన్ చేసుకొన్నవి, అవాస్తవమైనవని కమిషనర్ పేర్కొన్నారు. వైరల్ అయిన ఆడియో, వీడియోలో ఇన్స్పెక్టర్ సందేశ్ మాటలు, ప్రవర్తన సరికాదనేది రుజువైందని చెప్పారు. అయితే ఆడియో, వీడియోలో ఉన్న మహిళలు తాము ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మంగళూరులో సంవత్సరం నుంచి జరుగుతున్న బ్లాక్మెయిల్ కుట్రలను ఇక్కడ కూడా ఉపయోగించారన్నారు. ఏదేమైనా సీఐపై చర్యలు తీసుకున్నాం, పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలతో గౌరవంగా ప్రవర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఊరికెళ్లేందుకు
ఆర్టీసీ బస్సు అపహరణ
● కేకే ఆర్టీసీ డ్రైవరు ఘనకార్యం
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: అతను కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(కేకే ఆర్టీసీ)లో యాదగిరి జిల్లా సైదాపుర బస్సు డిపోలో డ్రైవర్ కమ్ కండక్టర్. ప్రతి రోజు మాదిరిగానే విధులకు వచ్చి రోజంతా ఆర్టీసీ బస్సును నడిపారు. రాత్రి డ్యూటీ దిగిన తరువాత సొంత ఊరికి ఇంటికి వెళ్లడానికి బస్సు లేకపోవడంతో ఏకంగా కేకే ఆర్టీసీ బస్సును వేసుకుని వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో అతని నిర్వాకం బయటపడింది. ఈనెల 19న రాత్రి యాదగిరి జిల్లాలోని రాచనహళ్లి గ్రామానికి చెందిన మహిపాల్రెడ్డి అనే కేకే ఆర్టీసీ బస్సు డ్రైవర్ విధులు ముగిసిన తర్వాత ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. డిపో అధికారుల ఫిర్యాదు మేరకు సైదాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే డ్రైవర్ను సస్పెండ్ చేశారు.
గజ దాడి..
ఆటో, బైక్ల ధ్వంసం
యశవంతపుర: ఇంటి ముందు నిలిపిన ఆటోను తుంటరి ఏనుగు ధ్వంసం చేసిన ఘటన కొడగు జిల్లా కుశాలనగర హుదికేరి గ్రామంలో జరిగింది. బెట్టదకాడుకు చెందిన హెచ్టీ సునీల్ తన ఆటోను శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలపగా అడవి నుంచి వచ్చిన ఏనుగు దాడి చేసి ధ్వసం చేసింది. దీంతో ఉపాధి పోయిందని బాధితుడు వాపోయాడు. హుదికేరి గ్రామంలోని సత్యనారాయణ గుడి, ఎంజీ కాలనీ చుట్టు పక్కల తిరిగిన ఆ ఏనుగు కొన్ని బైక్లను కూడా పడదోసి పాడు చేసింది. ఏనుగును చూసిన గ్రామస్థులు భయంతో గ్రామం నుంచి పారిపోయ్యారు. ఏనుగు కాఫీతోటలోకి వెళ్లిపోయింది. అటవీ సిబ్బంది రౌడీ ఏనుగు బంధించడానికి ప్రయత్నాలను ప్రారంభించారు.
దుర్గమ్మకు విశేష పూజలు
బొమ్మనహళ్లి: బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ అగరలో శ్రీదుర్గా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించారు.


