తుమకూరు: ఇస్పేట్ ఆడుతుండగా పోలీసులు పట్టుకున్న ఓ వ్యక్తి ఠాణాలో చనిపోయిన ఘటన జిల్లాలోని హుళియారు పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని యళనాడు గ్రామానికి చెందిన గుడిగౌడ కాంతరాజు (50)గా గుర్తించారు. అతని మృతికి పోలీసుల దౌర్జన్యమే కారణమని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్ ఎదుట శవాన్ని పెట్టి ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇస్పేటు ఆడుతుండగా ఆరుగురిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. రాత్రి 8 గంటలైనా పోలీసులు వారిని వదిలి పెట్టలేదు. అడిగేందుకు వెళ్లిన గ్రామస్తులను, కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్లోకి అనుమతించకుండా వాపసు పంపించారు. పోలీసుల లాఠీ దెబ్బలను తట్టుకోలేక కాంతరాజు చనిపోయాడని బంధువులు తెలిపారు. హడావుడిగా పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
గ్రామస్తుల ఆగ్రహం
ఇస్పేట్ ఆడితే ప్రాణం తీయాలా? అని గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. తమకు పరిహారం అందించాలని, సిబ్బందిని సస్పెండ్ చేయాలని కుటుంబీకులు పట్టుబట్టారు. మాజీ మంత్రి జేసీ మాధుస్వామి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ కిరణ్ జిల్లా ఎస్పీ కేవీ అశోక్ వచ్చి బాధిత కుటుంబంతో మాట్లాడారు. హోంమంత్రి పరమేశ్వర్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
పోలీసు స్టేషన్ ముందు ప్రజల ధర్నా


