● కోడలితో మామ అక్రమ సంబంధం
● రూ.2 లక్షల సుపారీ ఇచ్చి
తండ్రిని హత్య చేయించిన కుమారుడు
సాక్షి, బళ్లారి: యాదగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక దారుణమైన ఘటన కుటుంబ సంబంధాలపై మాయని మచ్చగా మారింది. కుమారుడి భార్యను కూతురిలా చూసుకోవాల్సిన మామ కామాంధుడిగా మారాడు. కుమారుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. చివరికి హత్యకు గురయ్యాడు. మార్చి 12వ తేదీన యాదగిరి జిల్లా గోనాళ గ్రామానికి చెందిన హంపన్న సజ్జన (74) అనే వృద్ధుడు తన పొలంలో దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రి హత్యపై కుమారుడు నరసారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనను సాధారణ హత్యగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు హంపన్న మొబైల్లో లభించిన ఫొటోలు, కాల్ డేటా వివరాలు సేకరించిన పోలీసులకు కుమారుడు నరసారెడ్డిపై అనుమానం వచ్చింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు.
కుంగిపోయిన కుమారుడు..
పోలీసులు దర్యాప్తులో హంపన్న చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడైంది. తన భార్యతో తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని తెలుసుకుని కుమారుడు నరసారెడ్డి మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భావనతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఎలాగైనా తండ్రి హంపన్నను హత్య చేయించాలని నిర్ణయించుకున్నాడు. నలుగురు వ్యక్తులకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. మార్చి 12వ తేదీన పొలంలో హంపన్నను దారుణంగా హత్య చేసి పారిపోయారు. సుపారీ ఇచ్చిన కుమారుడు నరసారెడ్డితో పాటు హత్య చేసిన తిరుపతి ప్రాంతానికి చెందిన వీరేష్, కృష్ణ, రమేష్, ఎం.వీరేష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
తోటలోనే మకాం..
హంపన్న తోటలో షెడ్డు వేసుకుని అక్కడే ఉండేవాడు. నాలుగు సంవత్సరాల క్రితం భార్య మృతి చెందింది. పొలానికి వచ్చే మహిళలతో పాటు, చివరికి కోడలిని కూడా బెదిరించి లొంగదీసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో కుమారుడు తట్టుకోలేక ఎలాగైనా తండ్రిన కడతేర్చాలని సుఫారీ ఇచ్చి హత్య చేయించాడని పోలీసులు వెల్లడించారు.


