రాయచూరు రూరల్: కొప్పళ తాలుకా బసాపూర్ వద్ద తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడి నీరు వృథా అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల అనంతరం మంత్రులు పర్యటించారు. శుక్రవారం రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, కొప్పళ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, కన్నడ సంస్క్రతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి అధికారులతో కలసి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గండి పడిన ప్రాంతం వద్ద త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. 90 ఎకరాల్లో వరి పంట నష్ట పోయిన రైతులకు పరిహరం అందేలా చూడాలని ఆదేశించారు. సంబంధిత శాఖ ఇంజనీర్లను పిలిచి పనులపై ఆరా తీశారు. కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం తగదన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బసన గౌడ తుర్విహళ్, రాఘవేంద్ర హిట్నాల్, జిల్లా అధికారి రాజశేఖర్ హిట్నాల్, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.


